జర్నలిస్టులు చనిపోతే రూ. 2 లక్షలు: అల్లం

by  |
జర్నలిస్టులు చనిపోతే రూ. 2 లక్షలు: అల్లం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని.. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, ఇతర జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. గత పది రోజుల్లోనే 15 మంది జర్నలిస్టులు కరోనాతో మృతి చెందారని గుర్తు చేసిన ఆయన బాధిత కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. మే10వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. జిల్లా వైద్య శాఖ అధికారితో కరోనా మరణం ధ్రువీకరణ పత్రం, అక్రిడిటేషన్ కార్డు, కరోనా పాజిటివ్ రిపోర్ట్‌తో పాటు, ఆయా జిల్లాల డీపీఆర్ఓలు ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు.

జర్నలిస్టు సంఘాలు, బాధిత కుటుంబాలను తరఫున ధ్రువీకరణ పత్రాలు సమర్పించడానికి కృషి చేయాల్సిందిగా అల్లం నారాయణ కోరారు. దరఖాస్తులను కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ హైదరాబాద్, ఇంటి నెంబర్ 10-2-1, సమాచార భవన్ రెండవ అంతస్తు, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్ అనే చిరునామాకు పంపించాలి. ఇతర వివరాలకు 040-23298672/74 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించి ప్రత్యేకంగా కరోనా పరీక్షా కేంద్రాలు, జర్నలిస్టులందరికీ టీకా కార్యక్రమం, కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వైద్య సౌకర్యాలు కల్పించాలని మీడియా అకాడమీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోందని వెల్లడించారు. అలాగే కొత్తగా కరోనా బారినపడిన రెండు వందల మంది జర్నలిస్టులకు కూడా ఈరోజు నుంచి తక్షణ సాయం అందిస్తున్నామని ఆయన వివరించారు.

Next Story