తెలంగాణ తొలి పీఆర్సీ: వైద్య ఆరోగ్యశాఖలో ఆ ఉద్యోగులకు అన్యాయం

by  |
prc
X

దిశ, ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి పీఆర్సీలో వైద్య ఆరోగ్య శాఖ లో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది. దీన్ని వెంటనే సవరించి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచి న్యాయం చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు భూపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ లు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచుతూ ఈ నెల 11వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని, అందులో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి జీవో 60 విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందులో గతంలో మాదిరిగానే మూడు స్లాబ్ లు పెట్టి రూ. 15600-19500-22750 గా వేతనాలు నిర్ణయించి అన్యాయం చేశారని ఆరోపించారు. ఒకవైపు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ న్యాయస్థానం ఆదేశాలను లెక్క చేయకుండా వాటిని తుంగలో తొక్కి అరకొర వేతనాలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. గత 16 నెలలు గా ప్రాణాంతకమైన కరోనా మహమ్మారితో ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు సెలవులే లేకుండా పని చేస్తున్నప్పటికీ ఇంత తక్కువగా వేతనాలు పెంచడం సమంజసం కాదన్నారు.

20 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ రెగ్యులర్ అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రెగ్యులర్ చేయకుండా మోసం చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. వీరందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలో కలిసి వచ్చే అన్ని యూనియన్ లను, అసోసియేషన్ లను కలుపుకుని.. ఉద్యోగులందరినీ సమీకరించి వేతనాలు రెగ్యులర్ అయ్యేవరకు దశలవారీ ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని వారు ప్రకటించారు. ఈ ఆందోళన పోరాటాలలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు రెగ్యులర్ ఉద్యోగులు అందరూ కలిసి రావాలని వారు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed