కేంద్రం సై.. రాష్ట్రం నో.. నష్టపోయిన కార్మికులు

by  |
construction workers
X

దిశ, తెలంగాణ బ్యూరో : కార్మికుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. కరోనా కాలంలో ఆదుకోవడంలో విఫలమైంది. అత్యవసర సేవలతో పాటు భవన నిర్మాణ కార్మికులకు వెసులుబాటు కల్పించినప్పటికీ ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యం చేసింది. దీంతో వేలాది మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కేంద్రం ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందుకురాలేదు. రెండో విడతలో ఏ ఒక్క కార్మికుడిని ఆదుకోలేదు.

కొవిడ్-19ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఈ తరుణంలో భవన నిర్మాణ రంగంతో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉపాధి నియంత్రణ, సేవా పరిస్థితి( రెగ్యూలేషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ కండిషన్ ఆఫ్ సర్వీసు యాక్టు 1996 ప్రకారం నిర్మాణ కార్మికుల బ్యాంకు ఖాతాలో భవన మరియు ఇతర నిధుల సెక్షన్22(1)(హెచ్) కింద డైరెక్టు బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) ద్వారా ఆర్థికసాయం అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్మికశాఖ నుంచి కేంద్రానికి అందజేసిన లిస్టు ప్రకారం సహాయమందించారు. భవన నిర్మాణ, ఇతర రంగాల కార్మికులకు సంక్షేమ బోర్డుల కంటే ఎక్కువ మొత్తాన్ని అందజేసినట్లు పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి భుపేందర్ యాదవ్ ప్రకటించారు.

దేశ వ్యాప్తంగా కరోనా ఫస్ట్ వేవ్‌లో 1,82,44,278మంది కార్మికుల ఖాతాల్లో రూ.5,618.35 కోట్లు డైరెక్టు బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అందజేసినట్లు వెల్లడించారు. రెండో విడతలో 1,23,89,067 మందికి 1,795.482కోట్లు డీబీటీ ద్వారా పంపిణీ చేశామని మంత్రి ప్రకటించారు. అదే విధంగా సెస్ ఫండ్ నుంచి దాదాపు 30లక్షల మంది కార్మికులకు ఆహార ప్యాకేజీలు అందజేశామని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కొవిడ్ ఫస్ట్ వేవ్‌లో తెలంగాణలో 8,30,324 మందికి 124.55 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి పార్లమెంట్‌లో వివరించారు. రాష్ట్రాలు ప్రతిపాదించిన కార్మికులందరికీ ఆర్థికసాయం అందజేశామని వెల్లడించారు. కొవిడ్ సెకండ్ వేవ్ కూడా తీవ్రంగా ఉండటంతో రాష్ట్రాలు భవన నిర్మాణ, ఇతర రంగాల్లో కార్మికులకు పని కల్పించాలని, ఆర్థికసాయం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంకారణంగా ఏ ఒక్క కార్మికుడి వివరాలను నివేదించలేదు. దీంతో కార్మికులకు ఆర్థికసాయం అందలేదు.

భవన నిర్మాణ కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం చూపుతుందనడానికి రెండు నెలలు నిలిచిన సెక్రెటరియేట్ పనులే ఇందుకు సాక్ష్యం. కరోనా సమయంలో భవన కార్మికులకు వెసులుబాటు కల్పించినా బిల్డర్లు, భవన నిర్మాణ యజమానులు ముందుకు రాకపోవడంతో ఉపాధి కరువైంది. దీనికి తోడు ప్రభుత్వం కూడా ప్రభుత్వ రంగంలో చేపట్టే పనులు సైతం కొనసాగించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్మికులు సైతం కరోనా సమయంలో పనులు లేక పోవడంతో పట్టణాలు వదిలి స్వగ్రామాలకు తిరిగివెళ్లారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వారిని ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదనే కార్మిక సంఘాల నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. దీనికి తోడు కేంద్రమంత్రి పార్లమెంట్ సమావేశాల్లో క్వశ్చన్ అవర్‌లో ఇచ్చిన సమాధానమే నిదర్శనం.

Next Story

Most Viewed