తెలంగాణలో 23 జిల్లాలకు పాకిన కరోనా

by  |

దిశ, న్యూస్ బ్యూరో:రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాలకు కరోనా వైరస్ పాకింది. గత నెల నాల్గవ తేదీన మొదటి కరోనా కేసు నమోదుకాగా ఇప్పటికి అది 272కు చేరుకుంది. ఇంతకాలం ఏయే జిల్లాల్లో ఎంతమంది పాజిటివ్ కేసులు నమోదయ్యాయో వివరాలు ఇవ్వని ప్రభుత్వం హఠాత్తుగా శనివారం రాత్రి విడుదల చేసింది. అయితే శనివారం సాయంత్రానికే ‘దిశ’ జిల్లాలవారీ వివరాలను అందజేసింది. ఆ వివరాలను జిల్లాలవారీగా అప్‌డేట్ చేసి రాత్రికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటివరకు జిల్లాల వివరాలనే ఇవ్వని ప్రభుత్వం ‘దిశ’ ప్రచురించిన తర్వాత గంటల వ్యవధిలో విడుదల చేయడం గమనార్హం. రాష్ట్రంలో జిల్లాల వారీ వివరాలను విడుదల చేయడం ఇదే తొలిసారి. ‘దిశ’ ప్రచురించే సమయానికి రాష్ట్రంలో 21 జిల్లాల్లో మాత్రమే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ప్రభుత్వం అప్‌డేట్ చేసి వెలువరించిన లెక్కల ప్రకారం వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు కూడా చేరడంతో మొత్తం కరోనా బాధిత జిల్లాల సంఖ్య 23కు చేరుకుంది. కరోనా పీడ సోకకుండా పది జిల్లాలు సురక్షితంగా ఉన్నాయి.

ఇప్పటిదాకా రాష్ట్రం మొత్తం మీద 1376 వైద్యారోగ్య బృందాలు అన్ని జిల్లాల్లోని 1.07 లక్షల ఇళ్ళను సందర్శించి 4.45 లక్షల మంది ఆరోగ్య పరిస్థతిని సర్వే చేసిందని డైరెక్టర్ పేర్కొన్నారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న 147 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించామని, పాజిటివ్ అని తేలిన ప్రాంతాల్లో రసాయనాలతో కూడిన నీరు చల్లుతూ వైరస్ ఉనికి లేకుండా చేస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed