ఏప్రిల్ 1 నుంచి ‘కరెంట్ షాక్’

by  |
ఏప్రిల్ 1 నుంచి ‘కరెంట్ షాక్’
X

సహకార సంఘాల ఎన్నికలు ముగిశాయి. ఇక వచ్చే నాలుగేండ్లలో తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేవు. అందుకేనేమో రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీలు, పన్నుల పెంపుతో ప్రజలను బాదుడు మొదలు పెట్టింది. మొన్నటికి మొన్న ఆర్టీసీ ఛార్జీలు, మద్యం రేట్లు పెంచిన ప్రభుత్వం, త్వరలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇంటి పన్నులు పెంచబోతోంది. అంతకుముందే.. ఏప్రిల్ 1 నుంచి ప్రజలకు కరెంట్ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

ప్రగతి భవన్‌లో సీఎం కే చంద్రశేఖర్‌రావు విద్యుత్ శాఖ అధికారులు, డిస్కమ్స్, టీఎస్ ట్రాన్స్‌క్, టీఎస్ జెన్‌కో ప్రతినిధులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఇందులో అన్నిరకాల విద్యుత్ ఛార్జీలు పెంచాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ఏ మేరకు టారీఫ్ రేట్లు పెంచాలనే విషయమై శనివారం తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌(టీఎస్‌ఈఆర్‌సీ)కు దక్షిణ, ఉత్తర పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ప్రతిపాదనలు ఇవ్వనున్నాయి. టారీఫ్ రేట్ల పెంపు ద్వారా రూ. 1500 కోట్ల అదనపు ఆదాయం పొందేలా డిస్కమ్స్ ప్రణాళికలు రచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కొత్త విద్యుత్ టారీఫ్ రేట్లను ఏప్రిల్ 1 నుంచే అమలులోకి తీసుకురానున్నారు.

గృహ వినియోగదారుల కరెంట్ బిల్లులు 8 నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే, 100 లోపు యూనిట్ల విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం ఉండకపోవచ్చు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. కానీ, 100 నుంచి 1000 లోపు యూనిట్ల వినియోగదారులపై భారం పెరగనుంది. దాదాపు 10 శాతం వరకు కరెంట్ బిల్లు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కమర్షియల్, ఇండస్ట్రియల్ వినియోగదారులపై పెద్ద ఎత్తున భారం మోపే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Next Story

Most Viewed