తెలంగాణ కేబినెట్‌ మీటింగ్‌లో కీలక నిర్ణయం.. పగలంతా అన్‌లాక్..?

by  |
తెలంగాణ కేబినెట్‌ మీటింగ్‌లో కీలక నిర్ణయం.. పగలంతా అన్‌లాక్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : దశలవారీగా ఆంక్షలను సడలిస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అన్ లాక్ దిశగా అడుగులు వేస్తున్నది. గత నెల 13వ తేదీ నుంచి కొనసాగుతూ ఉన్న లాక్‌డౌన్ మంగళవారం వరకూ కంటిన్యూ కానుంది. అయితే గత నెలలో కేవలం నాలుగు గంటలు మాత్రమే లాక్‌డౌన్‌‌కు సడలింపులు ఇవ్వగా ఈ నెలలో మరో నాలుగు గంటలు అదనపు అవకాశం కల్పించింది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిపోవడం, కొత్త కేసుల నమోదు అదుపులోకి రావడంతో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సడలింపులు ఇవ్వాలనే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌‌లో మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశం ఖరారు చేయనున్నది. యధావిధిగా సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు నైట్ కర్ఫ్యూను కొనసాగించే అవకాశాలున్నాయి.

థర్డ్ వేవ్ తథ్యం అనే హెచ్చరికల నేపథ్యంలో మంత్రివర్గం దీనిపై ప్రత్యేకంగా చర్చించనున్నది. బహుశా అక్టోబర్‌లో వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నందున అప్పటికల్లా పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవడం ఉత్తమమని రాష్ట్ర వైద్యారోగ్య భావిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే రోడ్ మ్యాప్‌ను కేబినెట్ సమావేశానికి పంపినందున చర్చల అనంతరం స్పష్టత రానున్నది. అదనపు బెడ్‌లు, ఆక్సిజన్ సౌకర్యం, ప్రత్యేకంగా పిల్లల వార్డులు, జిల్లాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు, వైద్య సిబ్బందిని పెంచడం… వీటన్నింటికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడం లాంటివాటిపై కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోనున్నది.

వ్యవసాయం, రైతుబంధుపై చర్చ

ప్రస్తుతం యాసంగి సీజన్ ముగిసి వానాకాలం కోసం రైతులు సన్నద్ధమవుతున్నందున వారికి పంటలు వేసుకోడానికి ప్రభుత్వం తరపున రైతుబంధు పేరుతో పెట్టుబడి సాయాన్ని అందించడం, విత్తనాలను అందుబాటులో ఉంచడం, నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టడం, ఎరువులు-పురుగుమందులను తగిన మోతాదులో సమకూర్చుకోవడం లాంటి పలు అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనున్నది. ఇక ఇంటర్ సెకండియర్ పరీక్షలను నిర్వహించడంలో ఉన్న సవాళ్ళు, రద్దు చేయడం ద్వారా ఉత్పన్నమయ్యే పరిణామాలు, ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై కూడా చర్చ జరగనున్నట్లు విద్యాశాఖ వర్గాల సమాచారం.

Next Story

Most Viewed