తెలంగాణ బడ్జెట్‌లో ఆ రంగానికే ప్రాధాన్యత.. ఎందుకంటే..?

by  |
తెలంగాణ బడ్జెట్‌లో ఆ రంగానికే ప్రాధాన్యత.. ఎందుకంటే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర బడ్జెట్‌లో ఈసారి సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎక్కువ నిధులు కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. 2021‌‌–22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్​ రూపకల్పనలు శాఖల వారీగా దాదాపుగా సిద్ధం చేశారు. ఈసారి జల వనరుల శాఖకు ఎక్కువ నిధులు కేటాయించే విధంగా ప్రతిపాదనలు తయారు చేశారు. ఇరిగేషన్​కు రూ.32 వేల కోట్ల కేటాయింపులు చేయాలని జల వనరుల శాఖ ప్రాథమిక ప్రతిపాదనలు పంపింది. సీఎం కేసీఆర్​ దీనికి ఆమోదం తెలిపిన తర్వాత ఇవి ఆర్థిక శాఖకు వెళ్లనున్నాయి. ప్రతిపాదనలను ఓకే చేస్తే తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇరిగేషన్​కు అత్యధికంగా నిధులు కేటాయించే బడ్జెట్​ ఇదే కానుంది. ఇప్పటి వరకు 2016–17 బడ్జెట్​లో రూ.26,625 కోట్లు కేటాయించారు.

ఈ ఏడాదే పూర్తి చేసేందుకు నిధులు

ఈ ఏడాదిలో రాష్ట్రంలోని కీలకమైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా ప్రభుత్వం బడ్జెట్​లో నిధులు కేటాయింపులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 2 టీఎంసీలకు సంబంధించిన పనులను డిసెంబర్‌ వరకు, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను ఆగష్టుకు పూర్తి చేయాలని ఈ రిజర్వాయర్‌తోపాటు కాల్వలు, కొండపోచమ్మ సాగర్‌ కింది కాల్వలు, గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్‌లు, అదనపు టీఎంసీలను సైతం కంప్లీట్​ చేసేందుకు అప్పులు, రాష్ట్ర బడ్జెట్‌ నుంచి రూ. 8 వేల కోట్లు కేటాయింపులు చేసేందుకు ప్రతిపాదిస్తున్నారని సమాచారం.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లు, డిండికి రూ.2 వేల కోట్లు, దేవాదుల పనుల కోసం సుమారు రూ.2500 కోట్లు, ఎస్‌ఎల్‌బీసీకి రూ.1500 కోట్లు, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులకు రూ.3వేల కోట్లతో పాటుగా ఆదిలాబాద్​, నిజామాబాద్​ జిల్లాల్లోని ప్రాజెక్టులు, కొన్ని కాల్వల మరమ్మతుల కోసం సుమారు రూ.1200 కోట్లు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అలాగే, ఈ ఏడాది టార్గెట్​గా పెట్టుకున్న సీతారామ, సీతమ్మసాగర్​, డిండి ప్రాజెక్టులకు కూడా నిధులు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.8 వేల కోట్లతో అంచనా వేసిన సీతారామ ప్రాజెక్టు, రూ.3,480 కోట్లతో నిర్మిస్తున్న సీతమ్మసాగర్​, రూ.6,300 కోట్లతో నిర్మిస్తున్న డిండి ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తి చేసి, ఆయకట్టుకు సాగునీరందించాలనే లక్ష్యంతో బడ్జెట్​లో దాదాపు రూ.5 వేల కోట్ల వరకు కేటాయింపులు చేస్తున్నారు.

మేజర్, మీడియానికి..

ప్రభుత్వం ఈసారి సాగునీటి ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టుతోంది. మొత్తం రూ.32 వేల కోట్లను ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేటాయించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు ఇరిగేషన్​ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి పంపినట్లు తెలుస్తోంది. బడ్జెట్​ కేటాయింపుల ప్రకారం 2015–16లో రూ. 11,733 కోట్లు, 2016–17లో 26,625 కోట్లు, 2017–18, 2018–19లో రూ.25 వేల కోట్లు చొప్పున, 2019–20లో రూ.8,476 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11,054 కోట్లు కేటాయించారు.
మేజర్​ ఇరిగేషన్​కు ఈసారి సుమారు రూ.20 వేల నుంచి రూ.22 వేల కోట్ల వరకు కేటాయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మీడియం, మైనర్​ ఇరిగేషన్​కు ఈసారి రూ.5వేల నుంచి రూ.6 వేల కోట్లు, ఆయకట్టు అభివృద్ధి కోసం రూ.200 కోట్లు, వరద నిర్వహణ కోసం రూ.100 కోట్లు బడ్జెట్​లో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కాగా, ప్రాజెక్టు పనుల స్పీడ్​ పెంచాలని బడ్జెట్​లో కేటాయింపులు, అవసరమైతే రుణ సమీకరణ కూడా చేసే విధంగా ప్రతిపాదనల్లో పేర్కొంటున్నారు. ఈసారి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రుణాలను తీసుకోవాలని భావిస్తున్నారు. దీనికోసమే వడ్డీల కింద కూడా బడ్జెట్​లో కేటాయింపులు చేస్తున్నారు.

మొదటి నుంచీ ప్రాజెక్టులకే ప్రాధాన్యం..

2018-19లో సాగునీటి రంగానికి రూ. 25 వేల కోట్లు, 2019-20లో, 2020–21లో కూడా భారీ మొత్తాలనే ఇరిగేషన్‌ రంగానికి కేటాయించారు. ఇందులో ఎక్కువగా కాళేశ్వరం ప్రాజెక్టు నిధుల సమీకరణకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ ద్వారా రూ.10,476 కోట్ల రుణాలు తీసుకుని బిల్లులు చెల్లించారు. సీతారామ, దేవాదుల ఎఫ్‌ఎఫ్‌సీ, ఎస్సారెస్పీ-2లను కలిపి ఏర్పాటు చేసిన మరో కార్పొరేషన్‌ ద్వారా రూ.2439 కోట్లు రుణంగా సేకరించారు. మొత్తంమీద రూ.13 వేల కోట్లను రుణాలుగా సేకరించగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లిస్తూ వస్తోంది. బడ్జెట్‌లో పేర్కొనకుండా ప్రత్యేకంగా కార్పొరేషన్లకు తెస్తున్న రుణాల్లో ప్రభుత్వ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యంగా ఉంది.


Next Story

Most Viewed