బడ్జెట్‌లో సంక్షేమానికి కోత

by  |
బడ్జెట్‌లో సంక్షేమానికి కోత
X

దిశ, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2020-21 వార్షిక బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీలకు కోత పెట్టింది. సంక్షేమానికి పెద్ద పీట వేసినట్టు ఆర్థిక మంత్రి హరీష్ రావు తన ప్రసంగంలో చెప్పినా.. సాంఘీక సంక్షేమ గురుకులాలకు రూ.2 కోట్లు, ఎస్సీ స్టూడెంట్స్ హాస్టల్స్‎కు రూ.1.76 కోట్లు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలను అందజేసేందుకు రూ.71 లక్షలను, కులాంతర వివాహాలు చేసుకునే వారికి అందించే ప్రోత్సాహాకాలలో నిధులు కేటాయింపులో గతేడాది కంటే కోత విధించింది. ఎస్సీ జనాభా దామాషా ప్రకారం మొత్తం జనాభాలో 15.81 శాతం నిధులు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఈ ప్రకారం 2011 జనాభా లెక్కలకు అనుగుణంగా 2020-21 బడ్జెట్ లో ఎస్సీలకు రూ.16,534.97 కోట్లను, 9.34 శాతం జనాభా కలిగిన ఎస్టీలకు రూ.9,771.28 కోట్లను ప్రభుత్వం కేటాయించినట్టు హరీష్ రావు వివరించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్టు, ఈ వర్గాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాలలో అభివృద్ది చెందేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీల నిధులను ఎస్సీ, ఎస్టీలకే ఖర్చు చేసేలా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని తెచ్చామన్నారు.

కుల వృత్తులకు మొండి చేయు..

బీసీ సామాజిక వర్గంలోని వివిధ కుల వృత్తులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ప్రారంభంలో ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహాం బాగానే అందినా.. రాను రాను నిరాదరణకు గురవుతున్నాయి. 2018-19 సంవత్సరంలో వివిధ సామాజిక తరగతుల సహకార సంస్థలకు నిధులు కేటాయించిన ప్రభుత్వం గడిచిన రెండేళ్ళుగా నిధులు కేటాయించడంలో మొండి చేయి ప్రదర్శిస్తోంది. గతేడాది, ఈ ఏడాది ఒక్క పైసా కూడా కేటాయింపులు చేయకపో్వడం విశేషం. మొత్తం బీసీలకు ఈ బడ్జెట్ లో రూ.4,356 కోట్లను కేటాయించింది. గతేడాది ఎంబీసీలకు రూ.5 కోట్లను మాత్రమే కేటాయించిన ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి రూ.500 కోట్లను కేటాయించింది. చేనేతకారులకు సహాయక గ్రాంటు కింద రూ.338 కోట్లను కేటాయించారు. సంచార తెగల అభివృద్దికి మాత్రం 2019-20 లో రూ.28 లక్షలు కేటాయించి, ఈ సంవత్సరం కేవలం రూ.2.81 లక్షలు మాత్రమే కేటాయించారు. మైనార్టీలకు రూ.1518 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. వచ్చే సంవత్సరం నుంచి 71 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలను ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Tags: Budjet, Sc, St, Bc, Minority Welfare

Next Story

Most Viewed