కేసీఆర్‌ ఇంట్లో లొల్లి.. గుట్టురట్టుచేసిన బండి సంజయ్

by  |
Bandi Sanjay, MP Arwind
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ‘‘మానవత్వం లేని మానవ మృగం కేసీఆర్. సమస్యలు వస్తే తప్పించుకుని తిరుగుతున్నాడు. హైదరాబాద్, వరంగల్‌లో వరదలొస్తే బయటకు రాలే. ఇన్నేండ్లు దేనికీ స్పందించని ముఖ్యమంత్రి హుజురాబాద్ ఉప ఎన్నికలు సమీపిస్తుండటంతో బయటకి వచ్చాడు. సిగ్గు, లజ్జా, మానం ఉన్నోడు ఎవడూ టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోడు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ సన్సేషనల్ కామెంట్స్ చేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నిధులు కేంద్రానివి, ఫోజులు కేసీఆర్‌వి అని, ప్రభుత్వ సంక్షేమ పథకాలల్లో ప్రధాని ఫొటో పెట్టకపోవటం దౌర్భాగ్యం అని విమర్శించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవ చేసింది ఒక్క బీజేపీ కార్యకర్తలు మాత్రమేనని, దేశవ్యాప్తంగా ఫ్రీ వాక్సిన్ ఇస్తామని కేంద్రం చెబితే కేసీఆర్ సన్నాయినొక్కులు నొక్కుతున్నరన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ అభివృద్ధి పనికి నిధులు ఇచ్చేది కేంద్రమే అని, దీనిపై కేసీఆర్‌ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎప్పటికైనా కేసీఆర్‌ను జైలుకు పంపే బాధ్యత బీజేపీదే అని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు కనుమరుగయ్యారని, ఉద్యమ ఆకాంక్షలు మరుగున పడ్డాయని, అమరవీరుల స్ఫూర్తిగా టీఆర్ఎస్‌పై పోరాటం చేసేందుకు ఆగస్టు 9న హైదరాబాద్‌ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఇంట్లో పీఠం లొల్లి జరుగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధుల గూర్చి గ్రామాల్లో ప్రచారం చేయాలని సంజయ్ పిలుపు నిచ్చారు.

కేసీఆర్ పచ్చిమోసకారి : ఎంపీ అర్వింద్

రాష్ట్రంలో ఏ ఉప ఎన్నికలు జరిగినా.. 50 వేల ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ మోసానికి దిగుతాడని ఎంపీ అర్వింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే జిల్లాకు 2.50 లక్షల ఉద్యోగాలు వస్తాయని అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతీ విషయంలో కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారని అన్నారు. దళితులకు ఇంటికి రూ.10 లక్షలు ఇస్తామంటూ మరోసారి మభ్యపెట్టే ప్రణాళిక సిద్ధం చేశారని విమర్శించారు. రైతులకు ఎరువులు ఇస్తామని మోసం చేశారని గుర్తుచేశారు. తెలంగాణలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ‘జీజీహెచ్’లో 80 శాతం నర్సుల కొరత ఉందని తెలిపారు. కేసీఆర్ తీరుతో రాష్ర్టంలో షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, ఆసియాలో పేరుగాంచిన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడతానికి కేసీఆర్, ఆయన తనయ కవితే కారణం అని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో కేసీఆర్ పసుపుతో సహా అన్ని పంటలు కొంటాను అని చెప్పి ముఖం చాటేశారని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు కన్నా మంచి వ్యవస్థ తెచ్చానని గుర్తుచేశారు. పసుపునకి, మొక్కజొన్నకి కావాల్సినవి ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసే సోయి ముఖ్యమంత్రికి లేదని అన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ తాగుబోతుల సంఘం తిరుగుతోంది, హుజురాబాద్ ఎన్నికల కోసమే ఉద్యోగాల పేరుతో మోసం చేయడాకి కుట్ర చేస్తున్నాడని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బస్వాలక్ష్మి నర్సయ్య, రాష్ర్ట ఉపాధ్యక్షులు యెండల లక్ష్మి నారాయణ, ప్రేమేందర్ రెడ్డి, బాల్కోండ ఇంచార్జీ ఎలేటి మల్లిఖార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed