తెలంగాణ బీటెక్ స్టూడెంట్ గ్రేట్ సర్వీస్

by  |
తెలంగాణ బీటెక్ స్టూడెంట్ గ్రేట్ సర్వీస్
X

దిశ, ఫీచర్స్ : సాయం చేసేందుకు చిన్న, పెద్ద వంటి స్థాయి భేదాలు అవసరం లేదు. ఆర్థిక నేపథ్యం అసలు మ్యాటరే కాదు. సాటి మనిషి కష్టాలకు చలించే మనసుతో పాటు తోచినంతలో సహాయం చేద్దామనే ఆలోచన వస్తే చాలు ఏ రూపంలోనైనా బాధితులకు అండగా నిలవచ్చు. పాండమిక్ సమయంలో ఎంతో మంది ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తుండగా.. ఆప్తులను కోల్పోయినవారు చివరి చూపులకు నోచుకోని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన బీటెక్ స్టూడెంట్ రాష్ట్రంలో కొవిడ్ బారినపడి చనిపోయినవారి దహన సంస్కారాలు నిర్వహిస్తూ మానవత్వం చాటుకుంటున్నాడు.

యూత్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అనే ఎన్జీవోతో పనిచేస్తు్న్న జీషన్ అలీ ఖాన్.. ఇతర వలంటీర్లతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1800 మంది కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించాడు. మహమ్మారికి బలై ప్రాణాలు కోల్పోయినవారి బాడీస్‌ దగ్గరకు వచ్చేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు భయపడుతూ దూరంగా నిలబడి చూస్తుండటం తనను కలిచివేసిందని, అలాంటి వారి కోసం నేనే ఏదో ఒకటి ఎందుకు చేయకూడదని అనిపించిందని తెలిపాడు.

ఈ మేరకు స్వచ్ఛంద సంస్థలో జాయిన్ అయినట్టు చెప్పిన ఖాన్.. సర్వీస్‌లో భాగంగా ఎదుర్కొన్న సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. ‘గతేడాది ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందగా, వైరస్ సోకుతుందన్న భయంతో తన కొడుకు అంత్యక్రియలు నిర్వహించకుండా పారిపోయాడు. ఆ పరిస్థితిలో దహన సంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయాన్ని అతని సోదరి మాకు తెలియజేసింది. ఇదొక్కటే కాదు, ఇలాంటి ఘటనలు ప్రతీచోట జరుగుతున్నాయని రియలైజ్ కావడంతో యూత్ గ్రూప్ తరఫున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను చేస్తున్న పనిలో ఆత్మ సంతృప్తి లభిస్తోంది’ అని పేర్కొన్నాడు.

క్రెమటోరియం/శ్మశాన వాటిక ఖర్చులు భరించే స్థోమతలేని కుటుంబాల కోసం తమ ఆర్గనైజేషనే చెల్లిస్తుందని, వలంటీర్లు కూడా ఉచితంగానే సర్వీస్ అందిస్తారని తెలిపాడు. కాగా, మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న జీషన్ తండ్రి బసాలత్ అలీ ఖాన్.. కొడుకు చేస్తున్న సర్వీస్‌‌తో పాటు యువతకు ఆదర్శంగా నిలుస్తుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.



Next Story

Most Viewed