వ్యాక్సిన్‌కు మరో ఐదారు నెలలు పట్టొచ్చు !

by  |
వ్యాక్సిన్‌కు మరో ఐదారు నెలలు పట్టొచ్చు !
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేరళ, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో వివిధ కారణాలతో కరోనా పాజిటివ్ కొత్త కేసులు పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వివిధ దేశాల్లో పెరుగుతున్న కేసులకు సెకండ్ వేవ్ కారణమంటూ వస్తున్న అధ్యయన నివేదికలపై కూడా దృష్టి సారించింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఇటీవల ముగిసిన పండుగలు, ఇకపైన వచ్చే పండుగలు, జనం గుమికూడే అవకాశాలు, వాతావరణంలో వస్తున్న మార్పులు తదితరాలతో వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. వ్యాక్సిన్ రావడానికి ఇంకో ఐదారు నెలలైనా పట్టే అవకాశం ఉన్నందున ఒకవైపు ప్రజల్లో స్వీయ నియంత్రణ పట్ల అవగాహన, చైతన్యం కలిగించడంతో పాటు మరోవైపు జనం ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో సంచార లాబ్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించి తాజా పరిస్థితిని అంచనా వేశారు.

పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై దృష్టి పెట్టిన ప్రజారోగ్య శాఖ కరోనా కట్టడి కోసం జిల్లాలవారీగా కార్యాచరణను సిద్ధంచేస్తోంది. అన్ని జిల్లాల్లోనూ అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఎన్ని లాబ్‌లు పెట్టాలి, రోజుకు ఎన్ని పరీక్షలు చేయాలి తదితర అంశాలపై స్పష్టత ఇవ్వనుంది. రాష్ట్రంలో పంద్రాగస్టు నుంచి కరోనా టెస్టుల సంఖ్యను పెంచిన ప్రభుత్వం గతనెల ప్రారంభం వరకూ రోజుకు సగటున 60వేల వరకు చేసింది. కానీ అన్‌లాక్ మార్గదర్శకాల అనంతరం పరీక్షలు చేయించుకోడానికి ప్రజలు పెద్దగా సిద్ధపడకపోవడంతో టెస్టుల సంఖ్య 40వేలకు తగ్గింది. ఇప్పుడున్న పరిస్థితులు, రానున్న మూడు నెలల కాలంలో తలెత్తపోయే అంచనాలకు అనుగుణంగా మళ్ళీ టెస్టుల సంఖ్య పెంచాలనుకుంటోంది. రానున్న మూడు మాసాలు చాలా కీలకమని భావిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ వాక్సిన్ అందుబాటులోకి వచ్చేంతవరకు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ, జాగ్రత్తలు పాటించేలా చేయడమే ఉత్తమం అనుకుంటోంది.

Next Story

Most Viewed