విడిపోయినా.. మా బతుకు మమ్మల్ని బతకనివ్వరా : మంత్రి

by  |
Minister-Niranjan-Reddy
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ‘‘మాకు సమైక్యాంధ్రలో న్యాయం జరగడం లేదని.. మా నీళ్ళు, మా ఉద్యోగాలు మాకు దక్కడం లేదని.. పద్నాలుగేళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నాం.. అయినా.. మా నీళ్ల వాటా మేము వాడుకుంటే ఓర్వలేక మళ్లీ నీటిని కొల్లగొట్టేందుకు ఆంధ్రా ప్రభుత్వం మళ్లీ కుట్ర పన్నుతోంది.’’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకవైపు కృష్ణ, మరోవైపు తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా.. తాగునీటికి, సాగునీటికి నోచుకోక బంగారం పండే భూములు ఉన్నా ఈ నడిగడ్డ ప్రాంతం గోస పడ్డదని మంత్రి తెలిపారు. ‘నీళ్ల కోసమే రాష్ట్రాన్ని సాధించుకున్నాం.. మా బతుకు మేము బతుకుతున్నాము. రాష్ట్రం విడిపోయినా ఆంధ్రా ప్రభుత్వం తమ బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు.’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మా నీళ్ళు మాకేనని కావాలి.. మీ నీళ్లు కూడా మాకే దక్కాలి’ అన్న చందంగా ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కృష్ణానదిలో ఎవరి నీటి వాటా ఎంతో అపెక్స్ కౌన్సిల్, కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయిస్తుంది అని మంత్రి చెప్పారు. కొత్తగా ప్రాజెక్టులు కట్టాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. కానీ ఏపీ ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సంగమేశ్వర ప్రాజెక్టు నిర్మాణం విషయానికి సంబంధించి అన్ని అనుమతులు వచ్చాకే నిర్మిస్తామని ఇప్పటికే లిఖిత పూర్వకంగా చెప్పింది.. వెంటనే ఆ లెటర్‌ను తుంగలో తొక్కి యథావిధిగా నీటి చౌర్యానికి పాల్పడేలా పనులు ప్రారంభించిందని మంత్రి ఎద్దేవా చేశారు. వారి వాటాకు మించి శ్రీశైలం నుండి నీటిని తీసుకువెళ్లాలనే కుట్రలను అడ్డుకుంటామన్నారు.

తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా నుండి ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రి స్పష్టం చేశారు. మన నీటి వాటాను ఎలా వినియోగించుకోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారని మంత్రి తెలిపారు. గతంలో ఉన్న అనుమతులతోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, జెడ్పీ చైర్ పర్సన్ సరిత, అదనపు కలెక్టర్ హర్ష పాల్గొన్నారు.


Next Story

Most Viewed