‘ఎంత దూరమైనా వెళ్తాం.. ఏపీకి చుక్క నీరు కూడా దక్కనివ్వం’

by  |
Agriculture Minister singireddy Niranjan Reddy
X

దిశ, వనపర్తి: ఏపీ ప్రభుత్వ జలదోపిడీ, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతువేదికను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ‘‘హక్కు లేకుండా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాతరేస్తాం. దాదాగిరి, గూండాగిరి, ఇక్కడ నడవదు’’ అని హెచ్చరించారు. హక్కులకు విరుద్ధంగా కృష్ణా బేసిన్‌లో దోసెడు నీళ్లను కూడా తీసుకోనివ్వం అని స్పష్టం చేశారు.

కృష్ణానది నుండి తెలంగాణకు హక్కుగా వచ్చే ప్రతి నీటి చుక్కను వినియోగించుకుంటామని వెల్లడించారు. వెన్నెముక లేని బానిస నేతల మూలంగానే నాడు తెలంగాణకు అన్యాయం జరిగిందని, నేడు స్వరాష్ట్రంలో ఏపీ జలదోపిడిని ఎట్టి పరిస్థితులలో అడ్డుకుని తీరుతామని, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తామన్నారు. సమైక్యపాలనలో ఆంధ్రా జలదోపిడికి మద్దతుగా హారతులు పట్టినోళ్లు, దొంగ ప్రాజెక్టులకు సద్దులు మోసిన ఇంటి దొంగలు ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శలు చేస్తుండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

అసలు తెలంగాణ ఉద్యమమే నదీజలాలు, సాగునీటి హక్కుల కోసమని మరిచారా? అని గుర్తుచేశారు. కృష్ణాజలాలలో తెలంగాణ నీటి వాటా తేల్చకుండా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. ‘‘వృథాగా పోతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏపీ సీఎం జగన్‌కు స్నేహ హస్తం అందిస్తే, కేసీఆర్ దూరదృష్టితో చేసిన సూచనలను వదిలేసి కృష్ణా జలాలను అన్యాయంగా తీసుకుపోవడం మిత్రద్రోహమే’’ అని మండిపడ్డారు.



Next Story