టీడీపీని వెంటాడుతున్న కేసులు.. రాష్ట్ర అధ్యక్షుడిపై మరో కేసు..

by  |
టీడీపీని వెంటాడుతున్న కేసులు.. రాష్ట్ర అధ్యక్షుడిపై మరో కేసు..
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ నేతలను వరుస కేసులు వెంటాడుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మొదలుకొని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తోపాటు కార్యకర్తలపై కూడా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు రిమాండ్‌కి వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పాటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడిపై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు న‌మోద‌యింది.

మ‌రో 48 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం టెక్కలి సమీపంలోని నందిగామలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులు హాజరైన సంగతి తెలిసిందే. విగ్రహావిష్కరణ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో వారు మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘించార‌ని వీఆర్వో ఆరంగి మల్లేశ్వరరావు ఫిర్యాదు చేశారు. దీంతో టెక్క‌లి పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.


Next Story