తీన్మార్ మల్లన్న.. ఓ బ్లాక్ మెయిలర్: చందూ నాయక్

by  |
తీన్మార్ మల్లన్న.. ఓ బ్లాక్ మెయిలర్: చందూ నాయక్
X

దిశ, నేరేడుచర్ల: జర్నలిస్ట్ పేరు చెప్పుకుంటూ బ్లాక్ మెయిల్ కు తీన్మార్ మల్లన్న పాల్పడుతున్నాడని, ఒక పార్టీలో చేరిన వ్యక్తి జర్నలిస్ట్ గా ఎలా కొనసాగుతాడని హుజూర్‌నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు గూగులోతు చందూ నాయక్ వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ.. జర్నలిస్ట్ అనే వ్యక్తి ఏ పార్టీతో సంబంధం లేకుండా వాస్తవాలను వెలికి తీసి వాటిని ప్రజలకు చూపించాలన్నారు.

కానీ బీజేపీకి చెందిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఒక యూట్యూబ్ ఛానెల్ ద్వారా తనకు నోటికొచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని అన్నారు. కేటీఆర్ కుమారుడు పై చేసిన వ్యాఖ్యలను ఆయన పూర్తిగా ఖండించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సాధ్యమని కానీ రాజకీయంలో కుటుంబాన్ని లాగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొని జర్నలిస్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

జర్నలిజాన్ని అడ్డంపెట్టుకొని అడ్డగోలు రాతలు రాస్తూ.. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. దూషిస్తే తెలంగాణ ప్రజలు.. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. మతతత్వ పార్టీ లో చేరి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్న చింతపండు నవీన్ పై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story