మెన్‌స్ట్రువల్ హైజీన్‌పై టీనేజర్ అవేర్‌నెస్

by  |
NGO Vice Chairman Pappu
X

దిశ, ఫీచర్స్: దేశం ఎంతగా అభివృద్ధి చెందినా.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తు్న్నా.. మెన్‌స్ట్రుయేషన్ (రుతుస్రావం) అనేది ఇప్పటికీ నిషిద్ధ అంశంగానే కొనసాగుతోంది. ఈ విషయంపై సొసైటీ దృక్పథాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. కాగా ఈ సమస్యను అధిగమించేందుకు విజయవాడకు చెందిన 18 ఏళ్ల కుర్రాడు నడుం బిగించాడు. మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్‌ విద్యార్థి అయిన ఈ టీనేజర్.. 9వ తరగతి నుంచే తన హెల్పింగ్ జర్నీ మొదలుపెట్టడం విశేషం.

ప్రస్తుతం ‘యూత్ సోషల్ కమ్యూనిటీ’ అనే ఎన్జీవోకు వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న పప్పు.. మొదట నిర్మాణ కార్మికులకు వాటర్ ప్యాకెట్స్, బటర్ మిల్క్ అందించే క్యాంపెయిన్ నిర్వహించాడు. ఆ తర్వాత కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించి పాఠశాలల్లో మెన్‌స్ట్రువల్ హైజీన్‌పై అవేర్‌నెస్ క్యాంపెయిన్స్ స్టార్ట్ చేశాడు. ఈ అంశంపై సమాజంలో నెలకొన్న అభిప్రాయాలను రూపుమాపి, సరైన అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.

ఆర్గానిక్, బయోడిగ్రేడబుల్ వంటివి నమ్మొద్దు..

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో క్యాంపెయిన్స్ నిర్వహిస్తు్న్నప్పుడు.. పప్పు మార్కెట్‌లో లభించే శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ చేసేవాడు. అయితే ఈ ప్యాడ్స్‌లో ఉండే పెస్టిసైడ్స్, కెమికల్స్, బ్లీచింగ్ పౌడర్, కలప గుజ్జు, పాలిమర్స్ వంటి హానికర రసాయనాలతో పాటు ఇతరత్రా పెట్రోలియం ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరమని గ్రహించాడు. వీటిని తయారుచేసే అనేక కంపెనీలు ‘బయోడిగ్రేడబుల్’ అనే పదాన్ని ఇష్టారీతిన వాడుతుండగా, నిజానికి ప్లాస్టిక్ అవశేషాలను కలిగిన ఈ ప్రొడక్ట్స్ అసలు బయోడిగ్రేడబుల్ కాదు. ఇక రక్తాన్ని అబ్జార్బ్ చేసుకునేందుకు ప్యాడ్స్‌లో బ్లీచింగ్ ఏజెంట్స్‌ ఉపయోగిస్తుంటారు. వీటిలో ఉండే డయాక్సిన్.. శరీరంలో క్యాన్సర్ కణాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. ఫలితంగా గర్భాశయ క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఈ మేరకు వెదురు ఫైబర్, అరటి ఫైబర్ గుజ్జు, కార్న్ స్టార్చ్ ప్లాస్టిక్ (మొక్కజొన్న నుండి తయారవుతుంది) ఉపయోగించి సేంద్రీయ ఉత్పత్తులను సృష్టించాడు.

వెదురు ఫైబర్స్‌తో తయారీ..

‘టాప్ షీట్ కోసం వెదురు ఫైబర్స్ ఉపయోగించాం. మధ్య పొర విషయానికి వస్తే ఇతర కంపెనీలు కలప గుజ్జు లేదా పత్తి, పాలిమర్‌లను ఉపయోగిస్తాయి. వాటికి బదులుగా మేము మధ్య పొరకు అరటి గుజ్జు ఫైబర్ ఉపయోగించాం. ఇక దిగువ పొరను ఇతర ప్యాడ్స్‌లో అయితే ప్లాస్టిక్‌ను ఉపయోగించే తయారు చేస్తారు. కానీ మేము మాత్రం కార్న్‌ స్టార్చ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించాం. ఒక్కో ప్యాడ్‌కు సుమారు రూ.16-18 ఖర్చు అవుతోంది’ అని పప్పు చెప్పుకొచ్చాడు.

ఇదే అతిపెద్ద సమస్య..

ఇండియాలో దాదాపు 80 శాతం మహిళలు శానిటరీ న్యాప్‌కిన్‌లకు బదులుగా అపరిశుభ్రమైన పాత వస్త్రాలను ఉపయోగిస్తున్నారు. ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేనప్పుడు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత బాలికలు పాఠశాల మానేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తను తయారుచేస్తున్న ప్యాడ్లను పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్న పప్పు.. ప్రాజెక్ట్ సురక్ష ద్వారా దేశమంతటా నెలకు 3.5 లక్షల ప్యాడ్లను పంపిణీ చేయాలని యోచిస్తున్నాడు.


Next Story

Most Viewed