విద్యుత్ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడానికి విద్యుత్ ఉద్యోగులు తగిన జాగ్రత్తలు తీసుకుని, సమాజాన్ని రక్షించుకోవడానికి కృషి చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్(టీఈఈ) 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయిబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగినపుడు కూడా డాక్టర్లు, పోలీసులు, మునిసిపాలిటీ సిబ్బంది‌తో పాటు ప్రాణాలకు తెగించి 24గంటలు నిరంతరాయంగా ప్రజలకు విద్యుత్ సౌకర్యాలను అందిస్తూ విధులు నిర్వహించిన ఘనత విద్యుత్ ఉద్యోగులదని పేర్కొన్నారు. అలాంటి విద్యుత్ ఉద్యోగులు ఇటీవల కరోనా సోకి తనువు చాలిస్తున్నారని, ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులంతా కరోనా జాగ్రత్తలను పాటిస్తూ వ్యాధి ఉన్నట్లు సందేహం వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కరోనాతో విద్యుత్ ఉద్యోగులు చనిపోతుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా అంశంలో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి సారించి సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక పరీక్షలు, క్రెడిట్ కార్డుతో అనుసంధానం చేస్తూ పూర్తి స్థాయి వైద్యం నిర్వహించే చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే విద్యుత్ సంస్థల సీఎండీలకు లిఖితపూర్వకంగా సంఘం తరఫున లేఖ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed