ఐఫోన్ యూజర్లకు కొత్త టెన్షన్.. కోట్లాది మందికి పొంచి ఉన్న ముప్పు

by Naga Rani Yarlagadda |

కోట్లాది మంది ఐఫోన్ యూజర్లు ప్రమాదంలో ఉన్నారు. డార్క్ స్వార్డ్ అనే స్పైవేర్ ఫోన్లలో డేటాను దొంగిలించడంతో పాటు క్రిప్టోకరెన్సీ వాలెట్స్ ను ఖాళీ చేస్తుందని నిపుణులు హెచ్చరించారు.

ఐఫోన్ యూజర్లకు కొత్త టెన్షన్.. కోట్లాది మందికి పొంచి ఉన్న ముప్పు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐఫోన్ వినియోగదారులను వణికించే మరో ప్రమాదకరమైన స్పైవేర్ వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్న ఐఫోన్లను లక్ష్యంగా చేసుకుని 'డార్క్ స్వార్డ్' (Dark Sword) అనే అత్యంత శక్తివంతమైన స్పైవేర్ దాడి చేస్తోందని భద్రతా పరిశోధకులు హెచ్చరించారు. గూగుల్, లుకౌట్, ఐ-వెరిఫై సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ మాల్వేర్ ఇన్ఫెక్ట్ అయిన వెబ్‌సైట్ల ద్వారా వేగంగా వ్యాపిస్తోందని NDTV పేర్కొంది. దీని సాయంతో హ్యాకర్లు వినియోగదారుల ఫోన్ల నుండి అత్యంత సున్నితమైన వ్యక్తిగత డేటాను దొంగిలిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు.

సౌదీ అరేబియా, టర్కీ, మలేషియా, ఉక్రెయిన్ వంటి దేశాల్లోని ప్రముఖ వ్యక్తులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని గూగుల్ వెల్లడించింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌కు చెందిన వార్తా వెబ్‌సైట్లు మరియు ప్రభుత్వ సంస్థల సైట్లలో ఈ మాల్వేర్‌ను నిక్షిప్తం చేసినట్లు సమాచారం. ఆ సైట్లను సందర్శించిన వారి ఫోన్ల నుండి సమాచారాన్ని సేకరించేందుకు హ్యాకర్లు దీనిని వాడుతున్నారు. ఈ స్పైవేర్ వెనుక కొన్ని వాణిజ్య సంస్థలతో పాటు, ప్రభుత్వ మద్దతు ఉన్న హ్యాకర్ల హస్తం కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

క్రిప్టోకరెన్సీ వాలెట్లు ఖాళీ?

ఇటీవలే వెలుగులోకి వచ్చిన కొరునా (Coruna) అనే మరో స్పైవేర్‌తో కలిసి ఈ 'డార్క్ స్వార్డ్' పనిచేస్తోంది. ఈ రెండు హ్యాకింగ్ టూల్స్ కలిస్తే క్రిప్టోకరెన్సీ వాలెట్లను ఖాళీ చేయడంతో పాటు, ఫోన్‌లోని పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్ల చేతుల్లో పెట్టగలవని పరిశోధకులు చెబుతున్నారు. అయితే.. ఈ మాల్వేర్ తాజా ఐఓఎస్ (iOS) వెర్షన్లపై ప్రభావం చూపనప్పటికీ, ఐఓఎస్ 18 (iOS 18) వెర్షన్ వాడుతున్న ఫోన్లపై సమర్థవంతంగా పనిచేస్తోంది. ప్రస్తుతానికి మార్కెట్లో దాదాపు పావు వంతు ఐఫోన్లు పాత ఓఎస్ వెర్షన్లపైనే నడుస్తుండటంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంది. గతంలో కూడా ఆపిల్ పరికరాల్లో ఇలాంటి భద్రతా లోపాలు తలెత్తాయి. గత ఏడాది మే నెలలో ఎయిర్ ప్లే (AirPlay) ఫీచర్‌లోని లోపాన్ని ఉపయోగించుకుని ఒకే వైఫై నెట్‌వర్క్‌లో ఉన్న డివైజ్‌లను హ్యాక్ చేసే అవకాశం ఉందని గుర్తించారు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా అత్యంత అధునాతన దాడుల ద్వారా లాక్ చేసిన ఐఫోన్లలో 'యూఎస్‌బీ రెస్ట్రిక్టెడ్ మోడ్'ను నిలిపివేసే ప్రయత్నం జరిగిందని ఆపిల్ స్వయంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ వినియోగదారులు తమ ఫోన్లను వెంటనే లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story