ఉల్లి సాగులో ఉద్యోగాలు.. ఎంటెక్, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ దరఖాస్తులు!

by  |
ఉల్లి సాగులో ఉద్యోగాలు.. ఎంటెక్, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ దరఖాస్తులు!
X

దిశ, ఫీచర్స్ : దశాబ్దాలుగా మలయాళీలు ‘గ్లోబల్ కమ్యూనిటీ’గా ఖ్యాతి పొందారు. ప్రపంచంలోని ఏ మూలలోనైనా కేరళీయులు కనిపిస్తారని పాక్షికంగా ఒక జోక్‌ ప్రాచుర్యంలో ఉండగా, ఇందులో వాస్తవం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాల్లో ఉద్యోగం కోసం వెతుకుతున్న కేరళీయులు దక్షిణ కొరియాలో ఓ ఉద్యోగం కోసం ఎగబడుతున్నారు. కేరళకు చెందిన టెకీలు, గ్రాడ్యుయేట్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకీ ఆ ఉద్యోగం ఏంటనేగా మీ సందేహం. దక్షిణ కొరియా ప్రభుత్వ సహాయంతో నడిచే ఉల్లి సాగు ప్రాజెక్టు‌లో పనిచేసే ఉద్యోగుల కోసమే ఆ రిక్రూట్‌మెంట్‌. కాగా దానికి జీతం లక్షకు పైనే ఉండటం విశేషం.

దక్షిణ కొరియాలోని సినాన్, మువాన్ దీవుల్లో అత్యధికంగా ఉల్లి పొలాలుండగా, అందులో పనిచేసే ఉద్యోగానికి సంబంధించి ఓవర్సీస్ డెవలప్‌మెంట్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోషన్ కన్సల్టెంట్ (ODEPC) ఇటీవలే తిరువనంతపురంలో ఓ సెమినార్‌ నిర్వహించింది. ఉల్లి సాగులో పనిచేసే ఉద్యోగికి నెలకు $1,500 ( రూ.1,12,500) చెల్లిస్తామని దక్షిణ కొరియా సంస్థ పేర్కొంది. నెలలో 28 పనిదినాలుండగా, రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయవలసి ఉంటుందని వారు తెలిపారు.

అయితే దక్షిణ కొరియాలో పని వాతావరణం, జీవన పరిస్థితులు, ఆహార పద్ధతులు వివరించడానికి నిర్వహించిన సెమినార్ రెండు సెషన్లలో జరిగింది. మొదటి బ్యాచ్‌లో 300 మంది, రెండో బ్యాచ్‌లో 500 మంది ఈ సెమినార్‌కు హాజరయ్యారు. ‘వాతావరణం కొన్నిసార్లు విపరీతంగా మారుతుంది. ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చు. దక్షిణ కొరియా వంటకాలు కేరళ కంటే చాలా భిన్నంగా ఉంటాయి. అక్కడ పంది మాంసం ప్రధానమైనది. కార్మికుల వసతితో యజమానులకు సంబంధం ఉండదు’ అని సెమినార్‌లో వివరించారు.

దక్షిణ కొరియా ఏజెన్సీ 100 ఖాళీల ఈ రిక్రూట్‌మెంట్‌ను ODEPCకి అప్పగించింది. భవిష్యత్తులో మరో 1,000 మందిని రిక్రూట్ చేసుకోవచ్చని ఏజెన్సీ తెలిపింది. ’మేము 4,000 కంటే ఎక్కువ దరఖాస్తులను స్వీకరించాం. ట్రాఫిక్ కారణంగా మా వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. ఈ ఉద్యోగానికి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు కాగా ఎంటెక్, బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన యువకుల నుంచి కూడా మేము దరఖాస్తులను స్వీకరించాం. దరఖాస్తులను స్క్రూటినీ చేసి 10 రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తాం’ అని ODEPC మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ తెలిపారు.

‘మొదటి వేవ్ సమయంలో ఉద్యోగం కోల్పోయాను. ఉపాధి కోసం తీవ్రంగా వెతుకుతున్నాను. వ్యవసాయంలో ఇంతకు ముందు అనుభవం లేదు. కానీ మంచి జీతంతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాను. అందుకోసం విదేశాల్లో శ్రమించడానికైనా సిద్ధమే. చాలా మంది సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించిన తర్వాత ODEPC వెబ్‌సైట్ క్రాష్ కావడంతో ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయలేకపోయాను’ అని ఎంబీఏ గ్రాడ్యుయేట్ చేసిన కిరణ్(32) అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు.

‘రెండేళ్ల క్రితం ఎలక్ట్రానిక్స్‌లో బీటెక్‌ పూర్తి చేశాను. ఇంజనీర్లకు మంచి జీతాలు అందించే అనేక మల్టీనేషనల్ కంపెనీలు దక్షిణ కొరియాలో ఉన్నాయి. సెలెక్ట్ అయితే ఓ ఏడాది పొలంలో పనిచేసి ఆ తర్వాత ఇంజినీరింగ్ జాబ్ చేస్తాను’ అని బీటెక్‌ పూర్తి చేసిన ప్రవణ్ అన్నాడు.

Next Story

Most Viewed