పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనున్న టెక్ మహీంద్రా అనుబంధ సంస్థ!

by  |
mahendra
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ టెక్ మహీంద్రా గ్రూప్ అనుబంధ సంస్థ కామ్‌వీవా వచ్చే ఏడాదిలో భారీ ఎత్తున నియామకాలను చేపట్టనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. మార్కెట్ వృద్ధికి అనుగుణంగా, అట్రిషన్ (ఉద్యోగ వలసలు) ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. దీనికోసం ప్రధానంగా టైర్2 నగరాలపై దృష్టి సారిస్తూ 2022, జూలై నాటికి దాదాపు 600 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు కంపెనీ సీఈఓ మనోరంజన్ చెప్పారు.

ప్రస్తుతం కంపెనీలో 2000 మంది ఉద్యోగులున్నారు. ప్రతి ఏటా 600 మందిని నియమించుకోవాలని భావిస్తున్నాం. వచ్చే ఏడాది క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా 300 మంది ఫ్రెషర్లను, ఇతర మార్గాల్లో మరో 200-300 మందిని తీసుకుంటామని మనోరంజన్ తెలిపారు. గత కొన్ని త్రైమాసికాలుగా కంపెనీ 20-23 శాతం మధ్య అట్రిషన్ రేటును ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కంపెనీ కార్యకలాపాలను విస్తరిస్తూ దీన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంపెనీ రూ. 845.1 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2021-22 ముగిసేలోపు 10-12 శాతం వృద్ధి సాధిస్తుందనే అంచనాలున్నాయి. కంపెనీ ప్రస్తుతం మొబైల్ పరికరాల ఆధారిత యాప్, టెక్నాలజీలకు ఐటీ పరిష్కారాలను మరింత వేగవంతంగా అందించడంపై దృష్టి సారించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.


Next Story