బుక్స్ లేకుండా చదువెలా సాగేది..!

by  |
బుక్స్ లేకుండా చదువెలా సాగేది..!
X

దిశ, మక్తల్ : కరోనా కారణంగా సుమారు 5 నెలల తర్వాత ఉపాధ్యాయులు తిరిగి పాఠశాలలకు వచ్చారు. కానీ విద్యార్థులు వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు చర్యలు చేపట్టింది. కానీ పుస్తకాలను విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సగానికిపైగా ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందలేదని సమాచారం. ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసినా సగానికి పైగా విద్యార్థులు వాటిని తీసుకెళ్లలేదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.

20,574 మంది విద్యార్థులు..

మక్తల్ నియోజకవర్గంలో‌ని నర్వ, ఉట్కూర్, కృష్ణ, మక్తల్, మాగనూరు, మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 18, 933 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరితో పాటు కస్తూర్బా‌గాంధీ గురుకులాల్లో 1,017 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తుండగా, ప్రభుత్వ హాస్టల్స్‌లో 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తంగా 20,574 విద్యార్థులకు ప్రభుత్వ పుస్తకాలు అందాలి.

కాగా, వారందరికీ ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో పుస్తకాలు అందలేదని సమాచారం. మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థులు పుస్తకాల కోసం పాఠశాలలకు వచ్చినా ఆ సమయానికి ఉపాధ్యాయులు లేకపోవడం వారు తిరిగి పాఠశాలలకు రాలేదు. ఒక వేళా సందేహాలు వస్తే విద్యార్థులు వాటిని ఎలా నివృత్తి చేసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాఠ్యాంశం ముగిశాక తిరిగి చదువుకోవడానికి పుస్తకాలు అందుబాటులో లేకుంటే విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యే అవకాశముంది. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


Next Story

Most Viewed