ఉపాధ్యాయ ఖాళీలను బహిర్గతం చేయాలి: రాష్ట్రఉపాధ్యాయ సంఘం

by  |
ఉపాధ్యాయ ఖాళీలను బహిర్గతం చేయాలి: రాష్ట్రఉపాధ్యాయ సంఘం
X

దిశ, నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను ముందుగా బహిర్గతం చేసి ఆ తర్వాత ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ను కొనసాగించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి ప్రభుత్వాన్ని, విద్యాశాఖను డిమాండ్ చేశారు. సోమవారం డీఈఓ కార్యాలయం ముందు ఉపాధ్యాయ సంఘం, జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్టో) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మెరుపు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పోస్టుల ఖాళీలను బహిర్గతం చేసిన తరువాతే బదిలీలు చేపట్టాలన్నారు.

రిజర్వేషన్, సీనియార్టీ వంటి అంశాల్లో తప్పుల తడకగా ఎంపిక ప్రక్రియను కొనసాగించారని తద్వారా చాలామంది ఉపాధ్యాయులు నష్టపోతున్నారని మండిపడ్డారు. ఒంటరి మహిళలు ఉపాధ్యాయులయినా భార్యాభర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ జాబితాలో ఉన్న తప్పులను సవరించేలా చర్యలు చేపట్టాలన్నారు అలాగే ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఉపాధ్యాయ సంఘాల తో చర్చించకుండా ఆగమేఘాల మీద బదిలీలు నిర్వహిస్తున్నారని, వాటివల్ల మహిళా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదముందని, ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇకనైనా స్పందించి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలన్నింటిని బహిర్గతం చేసి కౌన్సిలింగ్ నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ను కలిశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు ఏం సుదర్శన్, టీపీటీ యు జిల్లా అధ్యక్షులు సాయి రెడ్డి, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి ఎస్ మురళి, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఈశ్వర్ , మధుసూదన్ రెడ్డి, శ్రీధరరావు, సతీష్, కర్ణాకర్, నారాయణ, సురేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.



Next Story