తిరుపతిలో టీడీపీ గోవిందా..

by  |
తిరుపతిలో టీడీపీ గోవిందా..
X

దిశ, ఏపీ బ్యూరో : తిరుప‌తి కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ డీలా పడింది. క‌నీసం స‌గం డివిజ‌న్లలో కూడా పోటీ చేయ‌లేని ద‌య‌నీయ స్థితిలోకి జారిపోయింది. దీంతో వైసీపీ ఖాతాలోకి పోయినట్లే. గ‌తంలో రిజ‌ర్వేష‌న్ల విష‌యమై కోర్టుకెక్కడంతో తిరుప‌తి కార్పొరేష‌న్ ద‌శాబ్దానికి పైబ‌డి ప్రత్యేక అధికారి పాల‌న‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో తిరుప‌తి కార్పొరేష‌న్ ఎన్నికలను రెండు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కార్పొరేష‌న్‌లో 50 డివిజ‌న్లు ఉన్నాయి.

గత ఏడాది ఎన్నికలు వాయిదా పడేనాటికి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం ఆగిన చోట నుంచే తిరిగి ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ దౌర్జన్యాలతో తాము నామినేష‌న్లు వేయ‌లేక‌పోయామ‌ని ప‌లువురు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. మళ్లీ నామినేషన్​వేసే వెసులుబాటును ఎస్​ఈసీ కల్పించింది. తద్వారా తిరుప‌తిలోని ఆరు డివిజ‌న్లలో తిరిగి నామినేష‌న్లు వేసేందుకు టీడీపీకి అవకాశం దక్కింది. న‌గ‌ర‌పాల‌క సంస్థలోని 2, 8, 10, 21, 41, 45 డివిజ‌న్లకు మంగళవారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్లు వేశారు. ప‌దో డివిజ‌న్‌లో బీజేపీ మిన‌హా మిగిలిన చోట్ల టీడీపీ అభ్యర్థులు నామినేషన్​ దాఖలు చేశారు. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది.

మొత్తం 50 డివిజన్లలో కేవ‌లం 24 చోట్ల మాత్రమే టీడీపీ అతి క‌ష్టం మీద నామినేష‌న్లు వేయ‌గ‌లిగింది. అంటే స‌గం సీట్లలో కూడా పోటీ చేయలేదు. మ‌రో వైపు నామినేష‌న్ల విత్‌డ్రా చేసుకునే స‌మ‌యానికి సుమారు 23 చోట్ల వైసీపీ ఏక‌గ్రీవాలు సాధించుకునే అవకాశం ఉంది. టీడీపీ అధికారంలో అన్ని విధాలా ల‌బ్ధి పొందిన నాయ‌కులు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మొహం చాటేసినట్లు తెలుస్తోంది. ఇక పార్టీ కోసం తామెందుకు గ‌ట్టిగా నిల‌బ‌డాల‌నే నిరాశ‌నిస్పృహల్లో అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు.

పార్టీ నుంచి ఆర్థికంగా చేయూతనివ్వకపోవడం వల్లే పోటీకి వెనకాడినట్లు కనిపిస్తోంది. మొత్తంమీద 18 డివిజన్లను ఏకగ్రీవాలు చేసుకున్న వైసీపీ ఏడెనిమిది గెల్చుకోవడం తేలికే. ఇక నామినేషన్లు ఉపసంహరించునే సరికి టీడీపీ నుంచి ఎంతమంది బరిలో ఉంటారో కూడా అనుమానమే. దీంతో తిరుపతి కార్పొరేషన్​సునాయాసంగా అధికార వైసీపీకి దక్కినట్లే.



Next Story

Most Viewed