చుట్టూ మంటలు… మధ్యలో టీడీపీ కార్యకర్తలు..!

by  |
TDP protests,
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ధరల పెరుగుదలను నిరసిస్తూ నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పట్టణంలో రద్దీగా ఉండే గాంధీబొమ్మ సెంట‌ర్‌లో రోడ్డుపై వలయాకారంలో మంటలు వేశారు. చుట్టూ మంటలు… ఆ మధ్యలో టీడీపీ కార్యకర్తలు ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల్లూరు నగర నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో ఈ నిరసన జరిగింది.

ద‌ట్టమైన పొగ‌, మంట‌లు పైకి వ‌స్తున్నా.. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రద‌ర్శన‌ చేశారు. సుమారు 15 నిమిషాల పాటు చుట్టూ మంట‌లు వేసుకుని మంట‌ల మ‌ధ్యలో నిలుచుని నిరసన తెలిపారు. ప్రభుత్వ మంట‌ల నుంచి సామాన్య ప్రజ‌ల‌ను కాపాడాల‌ని డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన వారిలో మహిళా నేతలు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇది ఎంతో ప్రమాదకరమైన విధానం అయినప్పటికీ టీడీపీ శ్రేణులు ఎక్కడా వెనక్కి తగ్గకుండా తమ ఆందోళన కొనసాగించారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed