టీడీపీ మాజీ అధ్యక్షుడు రమేశ్‌బాబు ఇకలేరు..

by  |
టీడీపీ మాజీ అధ్యక్షుడు రమేశ్‌బాబు ఇకలేరు..
X

దిశ, చర్ల : తెలుగుదేశం పార్టీ చర్ల మండల మాజీ అధ్యక్షుడు, సాగునీటి సంఘం మాజీ చైర్మన్ పరుచూరి రమేశ్‌బాబు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మంగళవారం రాత్రి ఖమ్మం పట్టణానికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు‌గా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎంతో సౌమ్యుడైన రమేశ్‌ బాబు కలుపుగోలుతత్వం కలిగినవాడే కాదు ఎన్‌టీఆర్ వీరాభిమాని. అందుకే పలు పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా ఆయన టీడీపీని వీడలేదు. రమేశ్‌బాబు కొన్నేళ్ళపాటు చర్లలో జర్నలిస్టుగా కూడా సేవలందించారు.

అతని తండ్రి పరుచూరి సూర్యప్రకాశరావు చర్ల ఏఎంసీ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన పెద్ద తమ్ముడు పరుచూరి రవికుమార్ ప్రస్తుతం చర్ల పీఏసీఎస్ చైర్మన్‌గా పనిచేస్తూ టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యనేతగా ఉన్నారు. రెండవ తమ్ముడు పరుచూరి రవీంద్రబాబు జర్నలిస్టుగా సేవలు అందిస్తున్నారు. కుటుంబం అంతా సమాజసేవలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. రమేశ్‌బాబు మృతి పట్ల ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సంతాపం తెలిపారు. ఎంతో నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడని కొనియాడారు. మండల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, వ్యాపార ప్రముఖులు చర్లలో రమేశ్‌బాబు భౌతికకాయం వద్ద నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.


Next Story

Most Viewed