దేవినేని ఉమా అరెస్ట్‌ను ఖండించిన టీడీపీ నేతలు

by  |
దేవినేని ఉమా అరెస్ట్‌ను ఖండించిన టీడీపీ నేతలు
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్ట్‌ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొండపల్లి ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు దేవినేని ఉమా మహేశ్వరరావు కార్యకర్తలతో కలిసి బయలు దేరారు. అయితే జి.కొండూరు వద్ద వైసీపీ కార్యకర్తలు దేవినేని ఉమాను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి తిరువూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అక్కడ నుంచి పెదపారుపూడి పీఎస్‌కు తరలించారు. అక్కడ నుంచి నందివాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

నందివాడ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నందివాడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లే రహదారులను ఐదు కిలోమీటర్ల ముందే దిగ్బంధనం చేశారు. స్థానికులు సైతం ఆధార్ కార్డు ఉంటేనే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. మీడియాను సైతం అనుమతించడం లేదు. దేవినేని ఉమా పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు దేవినేని ఉమా హత్యాయత్నానికి పాల్పడినట్లుగా 307 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. దేవినేని ఉమా అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ముఖ్యంగా కృష్ణా-గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు రోడ్లపైకి రావడంతో పోలీసులు పలువురిని గృహనిర్బంధం చేశారు. ఈ ఘటన రాజకీయంగా అలజడి రేపుతోంది.



Next Story

Most Viewed