టీడీపీ కీలక నేత అరెస్ట్.. నారా లోకేష్, అచ్చెన్నాయుడు ఫైర్

by  |
TDP leader Dhulipalla Narendra
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద శుక్రవారం తెల్లవారుజామునే భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం నరేంద్రను అక్కడి నుంచి తమ వాహనంలో తీసుకెళ్లారు. ధూళిపాళ్ల ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపింది. కాగా, సీఆర్‌పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసి, నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు నోటీస్‌లో పేర్కొన్నారు ఏసీబీ అధికారులు.

ధూళిపాళ్ల అరెస్ట్ అక్రమం: అచ్చెన్నాయుడు, నారాలోకేష్

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. ప్రతిపక్ష నేతల అరెస్టులతో అధికార వైసీపీ రాక్షస ఆనందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టినందుకే ధూళిపాళ్లను అరెస్ట్ చేశారని విమర్శించారు. అనంతరం అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. వైసీపీ అరాచకాలను ప్రశ్నించినందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది వందశాతం కక్షసాధింపు చర్యే అని అన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం పెడుతున్న కేసులకు ఆధారాల్లేక కోర్టుల్లో వీగిపోతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కక్ష సాధింపు చర్యలు సరికాదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని సూచించారు. నోటీసులు ఇవ్వకుండా తీవ్రవాదిలా అరెస్ట్ చేశారని అన్నారు. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హితవు పలికారు.

FIR



Next Story