కేసీఆర్ వ్యూహానికి ‘బక్కని’తో చెక్ పెట్టిన చంద్రబాబు?

by  |
bakkani-narsimhulu-chandrab
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్.రమణ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో టీడీపీ భవిష్యత్తుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా బక్కని నర్సింహులను సోమవారం నియామించారు. ఈ నియామకం వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో అధికారంలోకి వస్తే దళితుడే సీఎం అని ప్రచారం చేశారు. కానీ, ఇప్పటి వరకు దళితుడిని సీఎం చేసింది లేదు. ప్రస్తుతం జరగబోయే హుజురాబాద్ ఎన్నికల దృష్టి ఎస్సీ సాధకారిత అనే పథకం ప్రవేశపెట్టారు. దీంతో టీఆర్ఎస్ దళితులను ఆకట్టుకునే ప్రయాత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా దళిత సామాజికవర్గానికి చెందిన బక్కని నర్సింహులను నియామించడంతో రాష్ట్రంలో జోరుగా చర్చసాగుతుంది.

లీడర్లను చేసిన టీడీపీ

తెలుగుదేశం పార్టీ అంటేనే నాయకుల తయారీ పరిశ్రమ అనే పేరుంది. రాజకీయ వారసత్వంలేని ఎంతోమంది అనామకులను నేతలుగా తీర్చిదిద్దిన చరిత్ర ఆ పార్టీది. ఆ కోవలోనే ఎల్.రమణను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా తెలుగుదేశంలో పదవులు అనుభవించిన నేతలున్నారు. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కని సామాన్య నేతలకు పార్టీలో ప్రాధాన్యతనిచ్చి ఫ్లైట్ ఎక్కించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, అవకాశాలకు అనుగుణంగా పార్టీలు మారే నేతలతో టీడీపీకి తలనొప్పిగా మారిపోయింది. మొన్నటి వరకు పార్టీకి విదేయుడుగానున్న ఎల్.రమణ అధికార పార్టీలో చేరి పదవులు అనుభవించాలనే లక్ష్యంతో వెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కారెక్కని నేతలకే అధ్యక్ష పదవి కట్టాబెట్టాలని పార్టీ ఆలోచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బక్కనిని నియమించినట్లు సమాచారం. ఒకనొక దశలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు నర్సింహులు వెనకడుగు వేసినట్లు ప్రచారం సాగింది. కానీ పార్టీకి విధేయుడిగా, నమ్మిన కార్యకర్తలకు చేదోడువాదోడుగా అందుబాటులో ఉంటూ బాబు దృష్టిలోనున్నారు. ఎన్నో అవకాశాలు అధికార పార్టీ నుంచి వచ్చినప్పటికీ పార్టీ మారకుండా ఒక్కసారి ఎమ్మెల్యే చేసిన పార్టీలోనే క్రమశిక్షణగల నేతగా కొనసాగడం విశేషం. ఇవన్ని దృష్టిలో పెట్టుకొని అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ నిర్ణయాలకు చెక్..

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలతో దళిత బహుజనలు, బీసీలు నష్టపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశంలో నాయకులకు కొదవలేదు. ఈ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఎందరినో నాయకులకు నీడనిచ్చిన పార్టీగా గుర్తింపు ఉంది. ఒకప్పుడు బీసీలోని పద్మశాలి, గౌడ్, యాదవ్, ముదిరాజ్, ఎస్సీ లాంటి నేతలందరూ ఎదిగినవాళ్లే ఉన్నారు. బీసీలకు వెన్నుదన్నుగా నిలిచిన పార్టీ తెలంగాణలోనూ బలహీన వర్గాల ప్రజలకే రాష్ట్ర అధ్యక్షులను నియామించింది. అంతేకాకుండా 2014 ఎన్నికల సందర్భంలో బీసీలకే రాష్ట్ర ముఖ్యమంత్రి అని నినాదంతో ముందుకు పోయింది. ప్రజల ఆధరణలేకపోవడంతో తగినన్ని స్ధానాలను దక్కించుకోవడంలో విఫలమైయింది. అయినప్పటికి బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే టీటీడీపీ అధ్యక్షుడిగా కొనసాగించింది. ఇప్పుడు దళితుడిని అధ్యక్ష పదవిని ఇచ్చి గౌరవిచ్చింది. దీంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తమ నిబద్దతను చాటుకుంటుంది. తెలుగుదేశంలో వెలుగువెలిగిన బక్కని నర్సింహులు. పార్టీలో తొలినుంచి క్రియాశీలకంగా ఉండే బక్కని నర్సింహులుకు కీలకపదవులు వచ్చినట్లే వచ్చి చేజారుతున్నాయనే సానుభూతి ఉంది. పార్టీ విపత్కర పరిస్థితుల్లో అధ్యక్షపదవి చేపట్టి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఇదే సరైన అవకాశమని బాబు భావించినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed