చేతగాకపోతే జగన్ రాజీనామా చేయాలి : టీడీపీ

by  |
Chandrababu Naidu
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ తెలుగు దేశం పార్టీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు స్పందించారు. ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందడం బాధాకరమని చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పదిరోజుల వ్యవధిలోనే దాదాపు 30 మందికిపైగా కరోనా రోగులు ఆక్సిజన్ అందక చనిపోవడం ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం అని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై పెట్టుంటే ఇవాళ ఇంతమంది కోల్పోయే పరిస్థితి దాపురించేది కాదని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు పోతుంటే లెక్కచేయకుండా.. శవాల దిబ్బపై రాజ్యమేలాలనుకుంటున్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రభుత్వ చేతగానితనం వల్లే రాష్ట్రంలో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ అందక చనిపోయిన వారివన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. అంతేగాకుండా.. చేతకాని పాలనతో ప్రజల ప్రాణాలు తీస్తున్న ముఖ్యమంత్రి జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు సరిపడా మందులు లేవని, ఆక్సిజన్ లేదని, బెడ్లు లేవని, ప్రభుత్వ వైఫల్యంతో ప్రజలు చనిపోతున్నా జగన్ రెడ్డికి మాత్రం కనీస మానవత్వం లేదని మండిపడ్డారు. పాలన చేతకాకపోతే జగన్ రెడ్డి రాజీనామా చేయాలి తప్ప ప్రజల ప్రాణాలు తీయడం ఎంత వరకు సమంజసమని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Next Story

Most Viewed