‘తన్నులు తినడానికి నేను ముందుంటా.. మీరు రండి’

by  |
Bakkani Narsimhalu
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో బ్రిటీష్ పాలన కొనసాగుతుందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఆరోపించారు. ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలే ఎజెండా ముందుకు సాగాలన్నారు. ఎన్టీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసమే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అవే పథకాలను చంద్రబాబు నాయుడు కొనసాగించడంతో పాటు గ్రామాల సమగ్రాభివృద్ధికి పాటు పడ్డారన్నారు.

టీడీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు పార్టీని మరింత చేరువచేయాలని సూచించారు. ప్రజల పక్షాన పోరాటానికి, తన్నులు తినడానికి తాను ముందుంటానని, మీరు ఉండాలని పిలుపు నిచ్చారు. అహింసా సిద్ధాంతంతో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్, గన్నోజు శ్రీనివాసాచారి, శేఖర్ రెడ్డి, రాజు నాయక్, సాంబయ్య, విద్యాసాగర్ రావు, ఖాదర్ అలీ, శ్రీధర్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed