వర్క్ ఫ్రమ్ హోం.. ఇదే వాటి థీం!

by  |
వర్క్ ఫ్రమ్ హోం.. ఇదే వాటి థీం!
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకూ కొవిడ్-19 వ్యాప్తి పెరుగుతూనే ఉంది. మొత్తం ప్రపంచమే ఇంటికి పరిమితమైన అరుదైన సందర్భమిది. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజ్‌లు, వ్యాపారాలన్నీ బంద్ అయ్యాయి. సినిమా థియేటర్లు నడవడంలేదు. ఇలా అన్నీ ఆగిపోయినప్పటికీ నిరంతరం కొనసాగుతున్నవి కూడా ఉన్నాయి. అవే సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఆన్‌లైన్ ఆధారంగా నడిచే సంస్థలు. ఈ సంస్థల ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లకుండా ఇంటి నుంచే చక్కబెట్టేస్తున్నారు. కరోనా కారణంగా చాలామంది ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ తో కొత్తరకం ఉద్యోగాలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడెక్కడి వారందరూ ఇంటి వద్దే కూర్చొని ఆఫీసు పనులను పూర్తి చేస్తున్నారు. అయితే, కరోనా నియంత్రణలోకి వచ్చిన తర్వాత కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానమే కొనసాగించడానికి పలు ఐటీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీనివల్ల సంస్థలకు కూడా మేలు ఉండటంతో ఎక్కువ శాతం కంపెనీలు ఈ విధానాన్ని భవిష్యత్తులో కొనసాగించే విధంగా చర్చలు జరుపుతున్నాయి.

ఇటీవల దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) రానున్న రోజుల్లో తమ ఉద్యోగులకు పనిగంటలను తగ్గించాలని భావిస్తున్నట్టు ప్రకటించింది. టీసీఎస్ ఆఫీసుల్లో ఉద్యోగులు ఉండే సమయాన్ని వచ్చే ఐదేళ్లలో తగ్గిస్తామని టీసీఎస్ సీవోవో గణపతి సుబ్రమణియం తెలిపారు. ఆఫీసులో 25 శాతం శ్రామిక శక్తి ఉంటే 100 శాతం ఉత్పాదకత సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా వరకు ప్రతి ఉద్యోగీ ఆఫీసుకే రావాల్సిన అవసరంలేదని, ఉద్యోగులు 25 శాతం సమయాన్ని మాత్రమే ఆఫీసులో ఉండి పూర్తి చేయవచ్చని గణపతి చెప్పారు.

మిగిలిన కంపెనీలు సైతం..

ఐటీసీతోపాటు మిగిలిన చాలా కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయించేందుకు ప్రణాళికలను రెడీ చేస్తున్నాయి. మార్చి నెల నుంచి ఐటీ ఉద్యోగులు సుమారు 85 శాతం ఇంటి నుంచే పనిచేస్తున్నారని టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ చెప్పారు. 2025 వరకూ టీసీఎస్ ఆఫీసుల్లో ఇదే విధానం అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. దీనికోసం ఆఫీసుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కొత్త డిజైన్‌లను తయారు చేస్తున్నట్లు వివరించారు. దేశీయ మరో దిగ్గజ ఐటీ సంస్థ విప్రోలోని ఉద్యోగులు 94 శాతం మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారని వెల్లడించింది. తాము సైతం దేశవ్యాప్తంగా భవిష్యత్తుల్లో ఉద్యోగులను ఆఫీసులకు పిలవాలా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నటు తెలిపింది. దిగ్గజ కంపెనీల రాబడి, మూల ధనంలో స్థిరత్వం ఉండటం వల్ల వాటికి ఇబ్బందుల్లేవని, చిన్న చిన్న ఐటీ సంస్థలకు ప్రొడక్టివిటీ సమస్య ఎదురయ్యే ప్రమాదముందని విశ్లేషకులు భావిస్తున్నారు. వీటిలో పని చేసే ఉద్యోగుల నుంచి 70 శాతం మాత్రమే ప్రొడక్టివిటీ ఉంటుంది. ఉద్యోగుల నుంచి ప్రొడక్టివిటీ కొనసాగితే సంస్థలు భవిష్యత్తులోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించవచ్చని కొన్ని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.

ఇబ్బందులూ ఉన్నాయి..

గడిచిన 20 ఏళ్లుగా ఇండియాలోని ఐటీ కంపెనీలు ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ సెంటర్(ఓడీసీ)లను కొనసాగిస్తున్నాయి. కొందరు ఉద్యోగులు జనరల్ ఎలక్ట్రిక్, బ్రిటిష్ ఎయిర్‌వేస్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌ల కోసం ప్రత్యేకంగా పని చేస్తారు. వీటి కోసం చేసే పనుల కోసం ఆయా ఉద్యోగులు సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను అనుసరిస్తూ ప్రత్యేకంగా కేటాయించిన ఆఫీసుల్లోనే చేయాల్సి ఉంటుంది. ఇటువంటి ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే వీలు కుదరదు. ముఖ్యంగా దేశంలోని హైదరాబాద్, పూణె, బెంగళూరు, చెన్నై, నోయిడా వంటి ప్రధాన నగరాల్లో ఐటీ కంపెనీల విశాలమైన క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఓడీసీ సెంటర్లలో విధులు నిర్వహిస్తూ తమ క్లైంట్లకు సర్వీసులను అందిస్తాయి. ఇటువంటి సెంటర్లను వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహించడం అసాధ్యమైన పని. ఇలాంటి ఇబ్బందులున్న వాటిని మినహాయించి ఇంటి నుంచే పనిచేయడానికి వీలున్న వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి అనేక ఐటీ కంపెనీలు సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తున్నాయి.

Tags: Work From Home, Tcs, Wipro, Rajesh Gopinathan, IT

Next Story

Most Viewed