ప్రజలపై కరోనా పన్ను!?

by  |
ప్రజలపై కరోనా పన్ను!?
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసిన కొవిడ్-19 మహమ్మారి నుంచి బయటపడేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రజలపై కరోనా పన్ను తప్పదని తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే సాధారణ బడ్జెట్‌లో ‘కొవిడ్ సెస్’ను విధించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీనికి అవసరమైన చర్చలు జరుగుతున్నాయని, అయితే కరోనా పన్ను ఏ విధంగా ఉండాలి, సర్ ఛార్జీ రూపంలో ఉండాలా లేదా అనేదానిపై బడ్జెట్‌కు ముందు నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. కరోనాను అడ్డుకునేందుకు నెలల పాటు లాక్‌డౌన్ విధించి భారీగా ఆదాయాన్ని కోల్పోయిన ప్రభుత్వం దాన్ని అధిగమించేందుకు సిద్ధమవుతోంది. రూ. 20 లక్షల కోట్ల భారీగా ఆర్థిక ప్యాకేజీ లోటును తీర్చుకునేందుకు సెస్ విధించాలని, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు జరిగిన చర్చల ప్రకారం అధిక ఆదాయం ఉన్నవారు, ఎక్కువ మొత్తం పన్నులను చెల్లించే వారికి మాత్రమే ఈ ‘కొవిడ్ సెస్’ను విధించేందుకు అంగీకరించినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

కరోనా వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి 2021-22 బడ్జెట్‌లో ‘కొవిడ్ సెస్’ ను అమలు చేయాలని, ఎంత శాతాన్ని విధించాలి, ఏ వర్గాల ప్రజలపై దీన్ని విధించాలనే దానిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు కొనసాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే, బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని మోడీ అధ్యక్షతలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ‘కొవిడ్ సెస్’ అంశం చర్చకు వచ్చే అవకాశాలున్నాయని, ఈ అంశానికి సంబంధించి ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోందని, వీలైనంత త్వరగా దీనిపై స్పష్టతకు రావొచ్చని తెలుస్తోంది. 2021-22 బడ్జెట్‌లోనే కాకుండా అదనంగా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపైనా ‘కొవిడ్ సెస్’ విధించే అవకాశలున్నాయని జాతీయ పత్రిక పేర్కొంది. పెట్రోల్, డీజిల్, కస్టమ్ డ్యూటీలపై ఈ సెస్‌ను విధించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ నెల మూడో వారం నుంచి వ్యాక్సినేషన్ కోసం అయ్యే ఖర్చుతో పాటు వ్యాక్సిన్ కొనుగోలుకు, ఆరోగ్య రంగంలో పనిచేసే వారి శిక్షణకు, రవాణా వంటి వాటి నిమిత్తం ఈ ‘కొవిడ్ సెస్’ తప్పదనే అభిప్రాయం ప్రభుత్వం నుంచి వినిపిస్తోంది.

Next Story

Most Viewed