ఒకేరోజు 70 ఔట్‌లెట్లను ప్రారంభించిన టాటా మోటార్స్

by  |
tata-motars
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ దక్షిణ భారత్‌లో కొత్తగా 70 ఔట్‌లెట్లను శుక్రవారం ప్రారంభించింది. ఈ కొత్త విక్రయ కేంద్రాలు దక్షిణ భారత్‌లోని 53 నగరాల్లో విస్తరించి ఉన్నాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా దక్షిణ భారత్‌లో విస్తరణ లక్ష్యంగా ఉన్నామని కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త ఆధునిక ఔట్‌లెట్లు కొత్త ప్యాసింజర్ మోడల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ను విక్రయించేందుకు ఉద్దేశించినవని పేర్కొంది. ‘దక్షిణ భారత్‌లో మొత్తం పరిశ్రమ విక్రయాల్లో 28 శాతం వాటాను కలిగి ఉంది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న మార్కెట్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా కొనసాగుతాం.

ప్రస్తుతం తమకు ఈ ప్రాంతంలో 12.1 శాతం వాటాను కలిగి ఉన్నాం. కొత్త ఔట్‌లెట్ల ద్వారా తమ వినియోగదారులకు సులభంగా కార్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నామని’ టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం అధ్యక్షుడు రాజన్ అంబ చెప్పారు. కొత్తగా ప్రారంభించిన ఔట్‌లెట్లతో కలుపుకుని ఈ ప్రాంతంలో సంస్థకు మొత్తం 272 ఔట్‌లెట్లు ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా మొత్తం 980 ఔట్‌లెట్లతో పాటు బెంగళూరులో 7, చెన్నైలో 5, హైదరాబాద్‌లో 4 సహా మొత్తం 32 కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించామని కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed