వచ్చే ఏడాదిలో మరింత పెరగనున్న కార్ల ధరలు!

by  |
tata-moters
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ఏడాదిలో కొత్తగా కారు కొనాలనుకునే వారికి కంపెనీలు మొండిచేయి చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుత ఏడాదిలో సెమీకండక్టర్ల కొరత, ఇన్పుట్ ఖర్చుల భారం కారణంగా పలుమార్లు వాహన ధరలను పెంచిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సవాళ్లు ఇంకా తీరలేదని చెబుతూ 2022, జనవరి నుంచి మరోసారి కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకి సహా, ప్రీమియం బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి దిగ్గజ కంపెనీలు కార్ల ధరలు పెంచుతామని చెప్పాయి. తాజాగా, టాటా మోటార్స్, హోండా, రెనాల్ట్ కంపెనీలు సైతం వచ్చే ఏడాది ప్రారంభం నుంచి తమ కార్ల ధరలను పెంచుతామని ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ముడి సరుకులు, ఇంకా ఇతర ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిపోతున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీలు స్పష్టం చేశాయి.

ఈ ఖర్చులను కొంచెమైనా తగ్గించేందుకు ఈ పెంపు అనివార్యంగా కనిపిస్తోందని టాటా ప్యాసింజర్ వాహనాల విభాగమ్మ్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర అన్నారు. హోండా ప్రతినిధి సైతం మరికొద్ది రోజుల్లో ధరల పెంపు ఉండనున్నట్టు పేర్కొన్నారు. కమొడిటీ ధరలు పెరుగుతున్న కారణంగానే ధరల పెంపు ఉండవచ్చన్నారు. మరోవైపు జనవరి నుంచి తమ వాహనాల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని రెనాల్ట్ తెలిపింది. గత ఏడాది కాలంగా ఉక్కు, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్ సహా వాహన తయారీలో విలువైన నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా ఉండటంతో ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు రెనాల్ట్ వెల్లడించింది.


Next Story

Most Viewed