నర్సంపేటలో టాస్క్‌ఫోర్స్ రైడ్స్.. అక్రమ వ్యాపారులకు షాక్

by  |
నర్సంపేటలో టాస్క్‌ఫోర్స్ రైడ్స్.. అక్రమ వ్యాపారులకు షాక్
X

దిశ, నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్‌లో గుట్టుగా సాగుతోన్న గుట్కా అక్రమ రవాణాను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. సరఫరా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. టాస్క్ ఫోర్స్ అడిషినల్ డీసీపీ వైభవ్ రఘునాధ్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట పట్టణంలోని సాయినగర్ కాలనీకి చెందిన పుల్లూరి జితేందర్ అనే వ్యక్తి ఇంట్లో గుట్కా నిల్వ ఉందన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో పెద్ద ఎత్తున నిషేధిత పొగాకు ఉత్పత్తులు లభ్యమైనట్లు తెలిపారు. వాటి విలువ రూ. 14లక్షల 17వేలు ఉన్నట్లు గుర్తించారు.

బీదర్ ప్రాంతం నుండి నర్సంపేటకి సరఫరా అవుతున్నట్లు, అహ్మద్ అనే వ్యక్తి బీదర్ నుండి ఇక్కడికి సరఫరా చేస్తూ ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గుట్కా సరఫరాతో సంబంధం ఉన్న, పాఖాల కొత్తగూడ మండలానికి చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని వలుపదాస వెంకటనారాయణ, వలుపదాస సాంబశివుడు, శ్రీనివాస్‌లుగా గుర్తించారు. గుట్కా రవాణాతో సంబంధం ఉన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు సమాచారం. నిందితులు గుట్కా సరఫరాకు ఉపయోగించిన ఒక కారు, రెండు టాటా ఎస్ వాహనాలు, ఒక సెల్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. వీరిని నర్సంపేట పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed