చిన్నమ్మ రాకతో తమిళనాడులో పొలిటికల్ హీట్

by  |
చిన్నమ్మ రాకతో తమిళనాడులో పొలిటికల్ హీట్
X

దిశ,వెబ్ డెస్క్: తమిళనాడు చిన్నమ్మ..దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ బుధవారం విడుదల అయ్యారు. నాలుగేండ్ల జైలు శిక్ష ముగించుకుని ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా ఇప్పుడు ఈమె విడుదలతో తమిళనాడు రాజకీయం హీటు ఎక్కబోతోంది. ఇన్నాళ్లు డీఎంకే, అన్నాడీఎంకే చుట్టూ తిరిగిన తమిళ రాజకీయాలు శశికళ రాకతో మరో మలుపు తిరగబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే శశికళ రాకతో అన్నాడీఎంకే నేతల్లో ఆందోళన మొదలైనట్టు సమాచారం…అసలు శశికళ రాకతో రాజకీయం ఎలా మారబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలకంగా ఎలా మారనున్నారు. వివరాల కోసం రీడ్ దిస్ స్టోరీ….

జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను చిన్నమ్మ శశికళ చేపట్టారు. అనంతరం రాష్ట్రానికి సీఎం అవ్వాలని ఆశించి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అంతలోనే అక్రమాస్తుల కేసులో ఆమె 2017లో జైలుకు వెళ్లారు. ఈ కేసులో కోర్టు ఆమెకు నాలుగేండ్ల జైలు శిక్ష విధించింది. బుధవారం నాటికి ఆమె నాలుగేండ్ల జైలు శిక్షను పూర్తి చేసుకుని విడుదలయ్యారు. కాగా నాలుగేండ్ల తర్వాత ఆమె బయటికి రావడంతో ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలకంగా మారనున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా తమిళనాడులో రాజకీయంగా తమ ప్రాభవాన్ని పెంచుకునేందుకు బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నది. అయితే ఆ పార్టీకీ తమిళనాడులో అత్యధిక సీట్లు గెలిచే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఏదో ఒక పార్టీకి మద్దతు తెలిపి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాలని బీజేపీ ఆలోచిస్తోంది. ఈ క్రమంలో తలైవా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ వార్తతో ఆ పార్టీలో ఆశలు చిగురించాయి. రజినీకాంత్‌ను ముందు ఉంచి వెనక నుంచి చక్రం తిప్పాలని బీజేపీ భావించింది.

అయితే ఇటీవల తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు…రాజకీయాల్లోకి తాను ఇప్పుడే రాలేనంటూ రజనీకాంత్ ప్రకటించాడు. దీంతో బీజేపీ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. కాగా జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు నడిచింది. ఈ నేపథ్యంలో పరిణామాలను చక్కదిద్దేందుకు పళనిస్వామి..పన్నీరు సెల్వంలు ఏకమయ్యారు. వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడంలో బీజేపీ పెద్దలు ప్రముఖ పాత్ర పోషించారన్నది జగమెరిగిన సత్యం. దీంతో బీజేపీ, అన్నాడీఎంకేల మధ్య స్నేహం చిగురించింది.

రజనీకాంత్ ప్రకటన తర్వాత..ఎన్నికల్లో అన్నాడీఎంకేతోనే ముందుకు వెళితే బాగుంటుందని బీజేపీ భావించింది. అయితే డీఎంకే పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచిస్తున్నారు. అలాంటి నేపథ్యంలో డీఎంకే పార్టీని ఎదుర్కొవాలంటే అన్నాడీఎంకే పూర్వ స్థితికి రావాలని బీజేపీ భావిస్తోంది. పార్టీ పూర్వస్థితికి రావాలంటే పన్నీరు సెల్వం, పళనిస్వామి, శశికళలు కలవాలనీ..పార్టీలో కుమ్ములాటలను తగ్గించి… పార్టీ పరిణామాలను చక్కదిద్దుకోవాలని అన్నాడీఎంకేకు బీజేపీ పెద్దలు చెబుతున్నట్టు సమాచారం.

పన్నీరు సెల్వం, పళనిస్వామిలు ఈ ప్రతిపాదన పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. శశికళతో కలిసేందుకు విముఖంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అన్నాడీఎంకే నేతల తీరుతో బీజేపీ మరో వ్యూహాన్ని కూడా రెడీ చేసుకున్నట్టు సమాచారం. అటు అన్నాడీఎంకేను సపోర్టు చేస్తూనే…తెర వెనుక శశికళ మద్దతును తీసుకునే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

ఇక అన్నాడీఎంకేలో ఎప్పటి నుంచో ఆధిపత్య వర్గంగా తేవార్ కులస్తులు ఉన్నారు. వీకే శశికళ కూడా తేవార్ వర్గానికి చెందిన నేత కావడం…అన్నాడీఎంకేలో ఉన్న తేవార్ వర్గ నాయకులతో ఆమెకు ఇప్పటికీ బలమైన రాజకీయ సంబంధాలు ఉన్నాయి. అందుకే శశికళ సపోర్టు తీసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ సపోర్ట్‌తో శశికళ అన్నాడీఎంకే పార్టీని కోలుకోలేని దెబ్బ తీసే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. దీంతో అన్నాడీఎంకే కొంచెం అయిష్టంగానే శశికళను పార్టీలో చేర్చుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే పార్టీలో ఆమె రీఎంట్రీకి అన్నాడీఎంకే పార్టీ నేతలు అంగీకరించినా…లేక బీజేపీ సపోర్టు దొరికినా తమిళ రాజకీయాల్లో ఆమె కీలకంగా మారుతారనేది కాదనలేని వాస్తవం.

Next Story

Most Viewed