జానారెడ్డి గౌరవం గంగలోకి.. తలసాని సంచలన కామెంట్స్

by  |
thalasani srinivas comments
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జానారెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి దారుణంగా ఓడిపోతున్నాడని, ఆయన గౌరవం గంగలోకి పోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ యాదవ్ ప్రచారంలో పాల్గొన్న తలసాని మాట్లాడుతూ జానారెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

జానారెడ్డి హుందాగా నామినేషన్ విత్‌డ్రా చేసుకుని దివంగత నోముల నర్సింహయ్య కుటుంబానికి సహకరిస్తే కొంతైనా గౌరవం దక్కేదన్నారు. జానారెడ్డి ఇన్నేండ్లు ఏం చేసిండో ఎవ్వరికీ అర్థం కావడం లేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని తెలిపారు. జానారెడ్డి పరిస్థితి ‘పేరు పెద్ద.. ఊరు దిబ్బ’ అన్న చందంగా మారిందని చెప్పారు. జానారెడ్డి నీతులు చెప్పడం మానుకుని ఇప్పటికైనా ప్రజల కోసం ఆలోచన చేయాలని, ఆయనకు చేతకాక, పనులు చేయలేక… ప్రచారం వద్దు, ఇంట్లో ఉందాం, ప్రచారానికి పోకుండా ఎన్నికలకు పోదాం.. అంటూ మాట్లాడుతున్నారని తలసాని ఎద్దేవా చేశారు.

ఇన్నాళ్లు జానారెడ్డి ప్రజలను మభ్యపెట్టి గెలుస్తూ వస్తున్నాడని, ఇప్పుడు పరిస్థితులు మారాయని, ప్రజలకు అభివృద్ధే ముఖ్యమన్నారు. అందుకే ప్రజలు టీఆర్ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. నోముల భగత్ వెంట సీఎం కేసీఆర్ ఉన్నారని, ఒక్కసారి గెలిస్తే.. సాగర్ రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు. నోముల భగత్ యువకుడు, ఉన్నత చదువులు చదువుకున్నాడని, ఆశీర్వదిస్తే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటాడని, సాగర్ ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. మంత్రి తలసాని వెంట అనుముల మండల ఇన్‌ఛార్జి కోనేరు కోనప్ప, హాలియా మున్సిపాలిటీ ఇన్‌ఛార్జి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులు పాల్గొన్నారు.

సాగర్ సమరం: కుర్రాళ్లతో పోటీ.. జానారెడ్డికి ప్రతిష్టాత్మకం



Next Story

Most Viewed