నవంబర్ 2 తర్వాత ఈటల ఉండడు : తలసాని షాకింగ్ కామెంట్స్

by  |
నవంబర్ 2 తర్వాత ఈటల ఉండడు : తలసాని షాకింగ్ కామెంట్స్
X

దిశ, హుజురాబాద్ రూరల్ : నవంబర్ 2 తరువాత ఈటల పరిస్థితి ఏంటో తెలుస్తుందని ఆ తర్వాత ఆయన ఇక్కడ ఉండడని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్ములను తన్నే రకమని ఆరోపించారు. ఈటల రాజేందర్ హుజురాబాద్‌లో మంత్రిగా ఉన్నాడని తాము ఇంతవరకు హుజురాబాద్‌కు రాలేదన్నారు. ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా హుజురాబాద్‌నే సెంటిమెంట్‌గా తీసుకుంటారని, రైతుబంధు స్టార్ట్ చేసినప్పుడు కరెక్ట్ అన్న ఈటల.. దళిత బంధును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి వ్యాఖ్యానించారు.

బండి సంజయ్ ఎంపీగా గెలిచి హుజురాబాద్‌కు ఏం ప్రాజెక్టు తీసుకువచ్చాడో చెప్పాలన్నారు. మత్స్యకారులను, గంగపుత్రులను ఈటల ఎప్పుడూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటి వరకూ లక్షా 14 వేల ఉద్యోగాలు ఇచ్చామని మరో రెండు మూడు నెలల్లో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. దళిత బంధు హుజురాబాద్ కోసం పెట్టలేదని ఏడాది క్రితమే అసెంబ్లీలో 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించారని తెలిపారు. దమ్ముంటే బీజేపీ దేశవ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ప్రతీ విషయంలోనూ సీఎం కేసీఆర్‌ను లాగుతూ సవాల్ విసురుతున్నారని, తాము ప్రధాని మోడీకి సవాల్ విసిరితే ఆయన వస్తాడా అని తలసాని ప్రశ్నించారు.

Next Story

Most Viewed