ఇండియా నుంచి టీ20 వరల్డ్ కప్ తరలింపు?

by  |
ఇండియా నుంచి టీ20 వరల్డ్ కప్ తరలింపు?
X

దిశ, స్పోర్ట్స్: పురుషుల టీ20 వరల్డ్ కప్‌ను ఇండియా నుంచి తరించడానికి ఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. అక్టోబర్ 18 నుంచి ఇండియా వేదికగా టీ20 వరల్డ్ కప్ నిర్వహించాల్సి ఉన్నది. అయితే దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టనందున ఈ మెగా టోర్నీ వేదికను ఇండియా నుంచి తరలించడానికి ఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జూన్ 1న దుబాయ్‌లోని ప్రధాన కార్యాలయంలో ఐసీసీ ఎగ్జిక్యూటీవ్ కమిటీ భేటీ నిర్వహించారు. బీసీసీఐ ప్రతినిధిగా ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ భేటీలో పాల్గొన్నారు. ఇండియాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలా వద్దే అనే నిర్ణయానికి రావడానికి నెల రోజుల గడువు బోర్డు కోరింది.

ఈ మేరకు జూన్ 28 వరకు బీసీసీఐకి గడువు ఇస్తూ ఐసీసీ ఎగ్జిక్యూటీవ్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. అయితే ఆనాటి సమావేశంలోనే ఐసీసీ ప్లాన్ బి గురించి వివరించినట్లు సమాచారం. ‘ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇండియాలో ఈ మెగా లీగ్ నిర్వహించడం కష్టమే. 16 జట్లతో 9 వేదికల్లో బయోబబుల్ ఏర్పాటు చేసి విజయవంతం చేయడం కత్తి మీద సాము లాంటిది. ఒక వేళ ఐపీఎల్ 2021లాగా మధ్యలో అవాంతరం ఎదురైతే అప్పటికప్పుడు తరలించడం అసాధ్యం. కాబట్టి యూఏఈ తరలించడానికి ఒప్పుకోండి’ అని ఐసీసీ తేల్చి చెప్పినట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఐసీసీ సమావేశంలో జరిగిన ఈ చర్చ అనంతరం బీసీసీఐ కూడా టీ20 వరల్డ్ కప్‌ను దేశం నుంచి తరలించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తున్నది.

ఆ షరతు తోనే..!

ఇండియా నుంచి టీ20 వరల్డ్ కప్ తరలించడానికి బీసీసీఐ ఒకే ఒక షరతుతో ఒప్పుకున్నట్లు సమాచారం. యూఏఈలో నిర్వహించినా ఆతిథ్య హక్కులు మాత్రం బీసీసీఐకి మాత్రమే ఉంటేనే తాము ఒప్పుకుంటామని తేల్చి చెప్పింది. ఆతిథ్య హక్కులు బోర్డుకు కేటాయించి ఏ వేదికలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలని నిర్ణయించినా తాము సిద్దమే అని బీసీసీఐ కూడా స్పష్టం చేసింది. ఈ షరతుకు ఐసీసీ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో అక్టోబర్‌ చివరి వారంలో యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 వరల్డ్ కప్ నిర్వహణకు రంగం సిద్దమవుతున్నది.

యూఏఈలో ఐపీఎల్ నిర్వహిస్తున్నందున టీ20 వరల్డ్ కప్ కాస్త వెనక్కు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. బీసీసీఐ ముందు ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ సవాళ్లు ఉన్నందున.. బోర్డు ఓపికగా వ్యవహరిస్తున్నది.. టీ20 వరల్డ్ కప్ హక్కులు వదులుకోవడం ద్వారా భారీగా నష్టపోతాము కాబట్టే అప్పుడే తమ నిర్ణయాన్ని బయటకు చెప్పడం లేదని ఐసీసీతో సంబంధం ఉన్న అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అక్టోబర్-నవంబర్ కల్లా పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకుంటుందని ఆశించింది. కానీ ఇప్పటికే దేశంలో ప్రతీ నిత్యం లక్ష కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అక్టోబర్ నాటికి ఇండియాలో థర్డ్ వేవ్ కూడా వస్తుందని వార్తలు వస్తుండటంతో బీసీసీఐ టీ20 వరల్డ్ కప్ తరలించడానికే మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది.

యూఏఈ, ఒమన్ వేదికలు?

కరోనా కారణంగా వాయిదా పడిన 31 ఐపీఎల్ మ్యాచ్‌లు యూఏఈలో నిర్వహించడానికి ఇప్పటికే బీసీసీఐ నిర్ణయించింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 18 నుంచి ప్రారంభం కావల్సి ఉండటంతో ఐపీఎల్‌ను అక్టోబర్ 10 లోపే ముగించడానికి బీసీసీఐ షెడ్యూల్ రూపొందించనున్నది. అయితే యూఏఈ పిచ్‌లను మరింత తాజాగా ఉంచడానికి ఒమన్ రాజధాని మస్కట్ వేదికగా క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నది. అక్టోబర్ చివరి వారంలో మస్కట్‌లో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ప్రారంభించి నవంబర్ మొదటి వారం నుంచి యూఏఈలోని అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికల్లో ప్రధాన మ్యాచ్‌లను నిర్వహించడం వల్ల పిచ్‌లు పాడవకుండా ఉంటాయిన ఐసీసీ భావిస్తున్నది.

మస్కట్ క్రికెట్ గ్రౌండ్‌కు గత ఏడాదే ఐసీసీ అంతర్జాతీయ హోదా కల్పించి కాబట్టి పెద్దగా అవాంతరాలేవీ ఉండవు. అంతే కాకుండా అక్కడ కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లే నిర్వహించడం వల్ల ప్రధాన జట్లు ఒమన్ వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదని ఐసీసీ చెబుతున్నది. జూన్ 28 వరకు బీసీసీఐకి సమయం ఉన్నా.. ఇప్పుడు ఓకే చెప్పి తీరా వరల్డ్ కప్ ప్రారంభించాక కోవిడ్ కేసులు బయటపడితే ఐపీఎల్ లాగా తరలించడానికి ఉండదని బోర్డు పెద్దలు భావించడం వల్లే ఐసీసీ ప్లాన్ బికి ఒప్పుకున్నట్లు తెలుస్తున్నది. ఆతిథ్య హక్కులు కూడా బీసీసీఐతోనే ఉండటంతో ఐపీఎల్‌కు చెల్లించినట్లు కేవలం స్టేడియం అద్దెలు, ఇతర ఖర్చులు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు, ఒమన్ క్రికెట్ అసోసియేషన్‌కు చెల్లిస్తే సరిపోతుంది.


Next Story

Most Viewed