బీజేపీ మాస్టర్ ప్లాన్.. ప్రచార బరిలోకి స్వామి గౌడ్

by  |
బీజేపీ మాస్టర్ ప్లాన్.. ప్రచార బరిలోకి స్వామి గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమ నేత, మండలి మాజీ ఛైర్మన్​ స్వామిగౌడ్​ ఎట్టకేలకు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆదివారం నుంచి ఆయన ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపుతో ఆయన ప్రచారానికి వచ్చారు. స్వామిగౌడ్​ ప్రచారానికి వస్తుండటంతో… ఉద్యోగ సంఘాల్లో కొంత విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతలు టీఆర్‌ఎస్‌కు మద్దతు చెప్పుతుంటే… తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులను కీలకం చేసి, ఉద్యోగులకు మొదటిదఫా మెరుగైన ఫిట్‌మెంట్ ఇప్పించడంలో సక్సెస్​ అయిన స్వామిగౌడ్..​ మరోవైపు ఓట్ల కోసం వస్తుండటం ఉద్యోగులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అయినప్పటికీ స్వామిగౌడ్​ వెంట నడిచేందుకు కొన్ని వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి.

మంత్రులంతా తిరుగుతున్నారు… నువ్వు రావాలే

రెండు రోజుల కిందట వరకు మండలి ప్రచారానికి స్వామిగౌడ్​ దూరమయ్యారు. దీనిపై రకరకాల ప్రచారం బయటకు వచ్చింది. టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహంలో చిక్కుకుని ప్రచారానికి రావడం లేదనే చర్చ జరిగింది. బీజేపీ అధిష్టానమే పట్టించుకోవడం లేదన్నారు. కారణాలేమైనా కీలకమైన మండలి ఎన్నికల సమయంలో ఆయన కనిపించకుండా ఉండటం రాజకీయవర్గాల్లో చర్చ సాగింది. కానీ బీజేపీ అధిష్టానం ఎట్టకేలకు స్వామిగౌడ్‌ను పిలిచినట్లు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఉద్యోగుల ఓట్లను రాబట్టుకోవడంలో స్వామిగౌడ్​ కీలకంగా ఉంటారనే కోణంలో ఆయనను ప్రచారానికి రావాలని బీజేపీ పెద్దలు కోరినట్లు ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా మండలి పోరులో ఉన్న బీజేపీ అభ్యర్థులు కూడా ఈ విషయంపై అధిష్టానానికి సూచించడంతో స్వామిగౌడ్‌ను ప్రచారానికి పిలిచారంటున్నారు. ఓ వైపు టీఆర్‌ఎస్‌కు మంత్రులంతా కలియతిరుగుతున్నారు. అన్ని వర్గాలతో సమావేశమవుతున్నారు. ఆదివారం ఒక్కరోజే మంత్రులు హరీష్​రావు, శ్రీనివాస్​గౌడ్​, గంగుల కమలాకర్​ కలిసి ఉద్యోగ సంఘాలన్నింటితోనూ సమావేశమయ్యారు. దాదాపు పది వేల మందిని కలిశారు. నిన్నటి వరకు కొంత చప్పగా సాగిన ప్రచారపర్వం… ఆదివారం నుంచి మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా నేతలను రంగంలోకి దింపుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సీనియర్లను సైతం పిలుస్తున్నారు. దీనిలో భాగంగా స్వామిగౌడ్​ను ప్రత్యేకంగా బీజేపీ పెద్దలు వెళ్లి ప్రచారానికి తీసుకువచ్చారు. ఆదివారం నుంచి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో ప్రచారం చేశారు. సోమవారం వరంగల్​ నుంచి మళ్లీ ప్రచారం చేస్తారని చెప్పుతున్నారు.

ఉద్యోగ సంఘాలపైనే ఫోకస్​

ప్రస్తుతం బీజేపీ కూడా ఉద్యోగ సంఘాలను ఫోకస్​ చేస్తోంది. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలు యూటర్న్​ తీసుకున్నాయి. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు టీఆర్‌ఎస్‌కు అనుకూల ప్రకటనలు చేస్తుండటంతో బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల్లో కొంత ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కూడా ఉద్యోగ సంఘాలపై ఇప్పుడు ఫోకస్​ పెట్టాయి. దీనిలో భాగంగా స్వామిగౌడ్​ కూడా ఉద్యోగ సంఘాలతో సమావేశాలకు ప్లాన్​ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోని ఉద్యోగ సంఘాలకు ఇప్పటికే సమాచారమిచ్చారు. వాస్తవంగా ఉద్యమంలో ముందు నుంచి ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ వచ్చిన స్వామిగౌడ్​ పిలుస్తుండటంతో కొంతమంది వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కానీ మరికొంతమంది మాత్రం వెనకాడుతున్నారు. ఎందుకంటే ప్రధాన సంఘాలు టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించడం, ఇప్పుడు స్వామిగౌడ్​ ఆహ్వానిస్తుండటంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కానీ వీరంతా ఇప్పుడు ఉద్యోగ సంఘాలపైనే ఫోకస్​ పెట్టారు.

Next Story

Most Viewed