సుస్థిరాభివృద్ధిలో ఏపీ కృషి బేష్ : నీతి అయోగ్

by  |
apgovt
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాధించుకునేందుకు కృషి చేస్తోందని నీతి ఆయోగ్ సలహాదారు శాన్యుక్తా సమద్దార్ బృందం అభిప్రాయపడింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నీతి ఆయోగ్ సభ్యుల బృందం సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్‌ 2020–21 రిపోర్ట్‌ను ముఖ్యమంత్రికి నీతిఆయోగ్‌ సభ్యుల బృందం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమగ్రాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, వివిధ రంగాల అభివృద్దికి ఇస్తున్న ప్రాధాన్యతను నీతిఆయోగ్‌ సభ్యులకు సీఎం వైఎస్ జగన్ వివరించారు. నీతిఆయోగ్‌ ఆధ్వర్యంలో సచివాలయంలో సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్‌డీజీస్‌) ఇండియా ఇండెక్స్‌ 2020–21, మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ (ఎంపీఐ) రెండు రోజులపాటు వర్క్‌షాప్‌ నిర్వహించారు.

ఎఎంపీఐ ర్యాంకింగ్‌లో భారత్‌ 62వ స్థానంలో ఉందని నీతి ఆయోగ్‌ సలహాదారు వెల్లడించారు. అయితే మానవాభివృద్ధి సూచికలో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏపీ 3వ స్థానంలో ఉందని.. త్వరలోనే మొదటి స్థానానికి చేరుకుంటామని ఏపీ ప్రభుత్వం నీతి ఆయోగ్‌కు స్పష్టం చేసింది. ఎస్‌డీజీ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రాన్ని మొదటి స్ధానంలో నిలిపేందుకు ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్లాలనే అంశంపై చర్చించారు. ఎస్‌డీజీ లక్ష్యాల సాధనపై రాష్ట్ర, జిల్లా స్ధాయి అధికారులకు నీతిఆయోగ్‌ సభ్యులు దిశానిర్దేశం చేశారు. నవరత్నాలలో భాగంగా వివిధ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేయడంపై నీతి ఆయోగ్ బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దికి ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను నీతి ఆయోగ్ సభ్యుల బృందం ప్రత్యేకంగా ప్రశంసించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో నీతి ఆయోగ్‌ ఎస్‌డీజీ ఆఫీసర్‌ అలెన్‌ జాన్, నీతి ఆయోగ్‌ డేటా ఎనలటిక్స్‌ ఆఫీసర్‌ సౌరవ్‌ దాస్, ఏపీ ప్రణాళికాశాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ ఉన్నారు.

Next Story

Most Viewed