అనూహ్య పరిణామం.. సస్పెన్షన్ ఉత్తర్వులు నిలిపివేత

by  |
అనూహ్య పరిణామం.. సస్పెన్షన్ ఉత్తర్వులు నిలిపివేత
X

దిశ, కరీంనగర్ సిటీ: జిల్లాలోని ఉపఎన్నికల్లో శిక్షణకు గైర్హాజరైన ఉపాధ్యాయులపై వేటేసినట్టే వేసి చివరి క్షణంలో వెనక్కి తగ్గింది జిల్లా యంత్రాంగం. ట్రైనింగ్ కు అటెండ్ కానివారు షోకాజ్ నోటీసులకూ స్పందించకపోవడంతో సస్పెన్షన్ కు రంగం సిద్ధం చేశారు. చివరి క్షణంలో ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టిన అధికారులు సంజాయిషీ మెమోలు జారీ చేసి సరిపెట్టారు.

ఇంతకీ ఏం జరిగిందంటే… కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయ, ఉద్యోగులకు డ్యూటీ వేసింది జిల్లా అధికార యంత్రాంగం. ఇందులో భాగంగా ఈ నెల 7, 8వ తేదీల్లో శిక్షణ ఇచ్చారు ఎన్నికల అధికారులు. ఈ ట్రైనింగ్ కు 40 మంది డుమ్మా కొట్టారు. వీరందరికీ జిల్లా విద్యాశాఖ అధికారులు షాకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఇందులో 12 మంది ఎలాంటి సంజాయిషీ ఇవ్వకపోవడంతో వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. 12 మంది టీచర్లపై వేటు వేయాలని మౌఖిక ఆదేశాలు రావడంతో జిల్లా విద్యాధికారులు చకచకా ఫైల్ సిద్దం చేశారు. బుధవారం రాత్రి వరకూ సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడుతాయన్న ప్రచారం జిల్లా విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఉపాధ్యాయ వర్గాల్లో కూడా ఈ అంశం కలకలం రేపింది. అయితే అనూహ్యంగా అధికారులు సదరు టీచర్లపై కనికరం చూపించారు. వారికి మరోసారి సంజాయిషీ మెమోలు జారీ చేయాలని నిర్ణయించారు. దీంతో జిల్లా విద్యాధికారి కార్యాలయం నుండి 12 మంది ఉపాధ్యాయులకు సంజాయిషీ మెమోలు జారీ చేసి 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇప్పుడో, అప్పుడో అందరికీ సస్పెన్షన్ ఉత్తర్వులు అందుతాయనుకోగా.. కొందరికి మాత్రమే అందాయి. వారు కూడా గురువారం డీఈవో కార్యాలయానికి వచ్చి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలంటూ మౌఖికంగా ఆదేశించినట్లు తెలుస్తుంది. సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడుతాయన్న చర్చ నుండి జిల్లా అధికారులు మరోసారి మెమోలు జారీ చేసి సరిపెట్టడం సరికొత్త చర్చకు దారి తీసింది.

Next Story

Most Viewed