అంతా సందిగ్ధం.. దుబ్బాక వ్యూహం అమలు చేస్తారా..?

by  |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ ఉప ఎన్నికలకు మరో 16 రోజులు మాత్రమే ప్రచారం మిగిలి ఉంది. ఈ గడువులోగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు పర్యటిస్తారని, ప్రజలకు హామీలిచ్చి టీఆర్ఎస్ గెలుపునకు రాచబాట వేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ నేటివరకు వారి పర్యటన అధికారికంగా ఖరారు కాలేదు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉండటం, వెయ్యిమందికి మాత్రమే అనుమతి ఉండటంతో సందిగ్ధం నెలకొంది.

ఎలాగైనా హుజూరాబాద్‌లో పర్యటించాలని, ప్రజల్లో భరోసా కల్పించాలని స్థానిక నాయకత్వం కోరుతోంది. ఒకవేళ పర్యటిస్తే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నిర్వహిస్తారా? లేకుంటే హుజూరాబాద్ నియోజకవర్గం సరిహద్దు నియోజకవర్గాల్లో సభ నిర్వహించి ప్రజలపై హామీలు గుప్పిస్తారా అనేది క్లారిటీ రాలేదు. ఎక్కువ శాతం హుజురాబాద్ సరిహద్దు జిల్లాల్లోనే సభ ఏర్పాటు చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా సభ ఏర్పాటు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉంది.

రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలకు పోలింగ్ ఈ నెల 30న జరుగనుంది. ఈ ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతోందని… ఈ విజయం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతుందని భావించి అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ హామీలిస్తున్నాయి. అంతటితో ఆగకుండా తమపాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ప్రతి ఓటరును కలిసి తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. పర్యటనలతో నియోజకవర్గంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపిందుకే ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సమావేశాలు, సభలు నిర్వహించారు.

ఇప్పటికే నియోజకవర్గంలో ఏ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారని అన్ని ప్రధానపార్టీలు సర్వేలు సైతం నిర్వహించారు. తమకంటే తమకే అనుకూలంగా ఉన్నాయని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పేర్కొంటున్నాయి. అయితే ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండటం, సర్వేలు సైతం టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా రావడం, ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా అనుకూలంగా రావడం లేదు. ఒక్క నియోజకవర్గానికే నాలుగు వందల కోట్లకుపైగా ఖర్చు చేసి అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గం విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజల అభిమానం చూరగొనడంలో వెనుకబడ్డారు. ఈటల రాజేందర్ రాజీనామాతోనే కోట్ల రూపాయలు విడుదలై పెండింగ్ పనులతో పాటు అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. అయితే ప్రజల్లోని ఆ భావనను తొలగించాలంటే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పర్యటన అనివార్యమని పార్టీ నేతలు భావిస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటించాలని ఇప్పటికే నేతలు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ నేటివరకు పర్యటన ఖరారు కాలేదు.

ఇదిలా ఉంటే సభ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖరాసే ఆలోచనలో పార్టీ ఉంది. ఒక వేళ అనుమతి వస్తే జమ్మికుంట లేదా హుజూరాబాద్ లో నిర్వహించే అవకాశం ఉంది. అయితే సీఎం సభ నిర్వహిస్తే సుమారు లక్షమంది హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వీధి మీటింగ్‌లకు వెయ్యిమంది మాత్రమే అనుమతి ఉంది. రోడ్ షో, మోటార్ సైకిల్ ర్యాలీలు నిషేధంలో ఉన్నాయి. సభకు వెయ్యి మందికి మాత్రమే అనుమతి ఉండటంతో అసలు సభ ఉంటుందా? ఉండదా? అనే సందిగ్ధం నెలకొంది. అయితే కొంత మంది మాత్రం దసరా తర్వాత నియోజకవర్గంలో సీఎం పర్యటిస్తారని స్థానిక నేతలు పేర్కొంటుండగా, మరికొంత మంది ముఖ్య నేతలు మాత్రం పర్యటన ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి కూడా సీఎం వెళ్లలేదు. కానీ గజ్వేల్ మండలం కొడకండ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజలకు హామీలు ఇచ్చారు. ఇప్పుడు జరుగుతున్న హుజూరాబాద్‌లో అదే విధంగా సభ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గానికి సమీపంలోని పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్ కార్యాలయం పూర్తి కావడంతో ప్రారంభోత్సవ సభ నిర్వహించి అక్కడే ప్రభుత్వ పథకాలు, ప్రజలకు చేస్తున్న సేవలను కేసీఆర్ వివరించే అవకాశం ఉంది. అయితే ఈ కార్యక్రమం షెడ్యూల్ కూడా ఖరారు కాలేదు.

ఇదిలా ఉంటే పెంచికల్ పేట శివార్లలో సీఎం సభ కోసం మంత్రులు స్థల పరిశీలన చేశారు. అయితే ఇది హుస్నాబాద్ నియోజకవర్గం బార్డర్ ఉండటంతో సభకు నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి కూడా అవసరం ఉండదు. అయితే ఇక్కడ సభ నిర్వహించి కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తే టీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకేనని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏదీ ఏమైనప్పటికీ అసలు కేసీఆర్, కేటీఆర్ పర్యటన ఉంటుందా? ఉండదా? అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.


Next Story

Most Viewed