జైలులో టీవీ ఏర్పాటు చేయమంటూ సుశీల్ డిమాండ్

by  |
జైలులో టీవీ ఏర్పాటు చేయమంటూ సుశీల్ డిమాండ్
X

దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఒక హత్య కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియం పార్కింగ్‌లో సాగర్ దండక్ హత్య కేసులో అతడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించాడు. అప్పట్లోనే తానొక రెజ్లర్‌నని, ఒలింపిక్ పతాకం సాధించానని.. తనకు మంచి డైట్ కావాలని డిమాండ్ చేశాడు. అయితే ఢిల్లీ రోహిణి కోర్టు అతడి అభ్యర్థనను పూర్తిగా కొట్టేసింది. జైలులో సహ ఖైదీలకు ఎలాంటి ఆహారం ఇస్తున్నామో అవే అధికారులు అందిస్తారని స్పష్టం చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులోని రెండో నెంబర్ బ్యారాక్‌లో ఉంటున్న సుశీల్ కుమార్.. మరో కోరిక కోరాడు.

తన గదిలో టీవీ పెట్టించాలని అతడు డిమాండ్ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా రెజ్లింగ్ పోటీలు జరుగుతున్నాయి. అలాగే ఒలింపిక్స్ కూడా దగ్గర పడుతుండటంతో తాను క్రీడా విశేషాలు తెలుసుకోవాలని భావిస్తున్నాను. అందుకే టీవీ కావాలని అతడు డిమాండ్ చేశాడు. కాగా నిబంధనల ప్రకారం న్యూస్ పేపర్లు మాత్రమే అందిస్తామని.. మరిన్ని సౌకర్యాలు కావాలంటే కోర్టును సంప్రదించాలని తీహార్ జైలు అధికారులు అతడికి స్పష్టం చేశారు. మరోవైపు నార్తరన్ రైల్వే ఉద్యోగి అయిన సుశీల్ కుమార్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అతడి సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.



Next Story