న్యూడెమోక్రసీ అగ్రనేత పోలీసుల ఎదుట లొంగుబాటు

by  |

దిశ, వరంగల్: సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సూర్యం, మరో నాయకుడు శ్యామ్ నర్సంపేట పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. సోమవారం రాత్రి ఇద్దరు పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి ఆయుధాలతో సహా లొంగిపోయినట్లు ప్రచారంలో ఉంది. కొన్నేళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో న్యూ డెమోక్రసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఆధిపత్య పోరు కోసం న్యూ డెమోక్రసీ దళాలు, మావోయిస్ట్ లతో ఘర్షణకు పడిన సంఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వారి చర్యలను అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కొద్ది రోజులుగా న్యూ డెమోక్రసీ దళాల మధ్య ఘర్షణలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో పార్టీకి పెద్ద‌ దిక్కుగా ఉన్న సూర్యం లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు సోమవారం రాత్రి సూర్యం సహచరుడు శ్యామ్ తో కలిసి నర్సంపేట ఏసీపీ ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. కాగా సూర్యం, శ్యామ్ నిన్న అర్థరాత్రి వరంగల్ రూరల్ జిల్లా అసరవెల్లి, మేడపల్లి గ్రామాల సరిహద్దుల ప్రాంతంలోని ఒక ఇంట్లో సేద తీరుతున్నారనే సమాచారం మేరకు నర్సంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోన్నది. నేడో రేపో వారి‌‌ లొంగుబాటును పోలీసులు అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed