ఎల్జీ పాలిమర్స్‌కి సుప్రీంకోర్టు షాక్

by  |
ఎల్జీ పాలిమర్స్‌కి సుప్రీంకోర్టు షాక్
X

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్‌లోని ఆర్ఆర్ వెంకటాపురంలోని స్టైరిన్ గ్యాస్ లీకేజీకి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించరాదని ఇటీవలే ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎల్జీ పాలిమర్స్ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ లలిత్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఎల్జీ పాలిమర్స్‌లో కంపెనీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. పరిశ్రమలోకి అత్యవసరంగా వెళ్లేందుకు తమను అనుమతించాలంటూ ఎల్జీ పాలిమర్స్ విజ్ఞప్తి చేసింది. అంతే కాకుండా గ్యాస్ లీక్ వ్యవహారంపై ఏడు కమిటీలు విచారణ చేస్తున్నాయని, ఏ కమిటీ ముందు విచారణకు హాజరు కావాలో కూడా తమకు అర్థం కావడం లేదని ఎల్జీ పాలిమర్స్ వాదన వినిపించింది. దీనిపై ధర్మాసనం.. ఎన్జీటీ లేదా హైకోర్టు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాయని, ఆయా విచారణలు ముగిసిన తర్వాతే సుప్రీంకోర్టుకు రావాలని వ్యాఖ్యానించింది.

ఎల్జీ పాలిమర్స్ కోరుతున్నట్టు ఆదేశాలివ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో సర్వోన్నత న్యాయస్ధానం తీర్పుతో ఏడు కమిటీల ముందు విచారణకు హాజరు కాకుండా గట్టెక్కవచ్చని భావించిన ఎల్జీ పాలిమర్స్ ఆశలు అడియాశలయ్యాయి. ప్రతి కమిటీ ముందు విచారణకు హాజరైన తరువాత సుప్రీంకోర్టు ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది.



Next Story

Most Viewed