ఇంకెన్నాళ్లు..? రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by  |
supreme court
X

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వేషన్ల అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలు ఇంకెన్ని తరాల పాటు రిజర్వేషన్లను కొనసాగిస్తాయని ప్రశ్నించింది. దేశానికి స్వతంత్ర్యం వచ్చి 70 ఏండ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఒక్క అణగారిన కులం కూడా ప్రయోజనం పొందలేదా..? అంటూ వ్యాఖ్యానించింది. మరాఠా కోఠాకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదిస్తూ.. మండల్ కమిషన్ రిజర్వేషన్ల కేసు (ఇందిరా సహానీ కేసు తీర్పు) తీర్పును సమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. రిజర్వేషన్ల కోటాలను నిర్దేశించే అంశాన్ని న్యాయస్థానాలు రాష్ట్రాలకే వదిలేయాలని ఆయన కోరారు. రెండేండ్ల క్రితం కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10 శాతం కోటా ఇవ్వాలన్న నిర్ణయం కూడా 50 శాతం కోటాను ఉల్లంఘించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

దీనిపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీరు చెబుతున్న (ముకుల్ రోహత్గి వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ) దాని ప్రకారం రిజర్వేషన్లపై పరిమితి లేనప్పుడు ఏర్పడే అసమానతల మాటేమిటి..? ఇలా ఎన్ని తరాలకు రిజర్వేషన్లను కొనసాగిస్తారు’ అని ప్రశ్నించింది. దేశానికి స్వతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా ఒక్క వెనుకబడ్డ కులం కూడా అభ్యున్నతిలోకి రాలేదా..? ఇన్నేళ్లలో అసలు అభివృద్ధే జరగలేదని భావించాలా..? అని ధర్మాసనం ప్రశ్నించింది.



Next Story

Most Viewed