కాళేశ్వరంపై ఎన్జీటీలో పిటిషన్ ఫైల్ చేయొచ్చని సుప్రీం సూచన

by  |
supreme court
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో పర్యావరణ ఉల్లంఘనలు, అవినీతి జరుగుతోందని, దీనిపై విచారణను ఆదేశించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాకు చెందిన తుమ్మనపల్లి శ్రీనివాస్, గాండ్ల తిరుపతి, బర్మ కనకయ్య సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ నిర్వహించింది. పిటిషన్‌లో పర్యావరణ సంబంధమైన అంశాలతో పాటు గతంలో ఎన్జీటీ ఆదేశించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పనులు కొనసాగిస్తూనే ఉన్నట్టు పిటిషనర్ పేర్కొన్నందున అక్కడే ఎగ్జిక్యూషన్, కంటెప్ట్ పిటిషన్ వేయవచ్చని సూచించింది.

గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని ఉల్లంఘిస్తూ పనులు జరుగుతున్నట్లయితే ఆ కోర్టులోనే కోర్టు ధిక్కార నేరం కింద పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని సూచించింది. కానీ దానికి భిన్నంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం నేరుగా సుప్రీంకోర్టుకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ఎన్జీటీ ఆదేశాలను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం కంటే ఎన్జీటీలోనే కంటెప్ట్ పిటిషన్ ఫైల్ చేయవచ్చని సూచించింది. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేయవచ్చు కదా అని వ్యాఖ్యానించింది. త్రిసభ్య ధర్మాసనం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న పిటిషనర్ తరపు న్యాయవాదులు.. సుప్రీంకోర్టు సూచన మేరకు ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేస్తామని స్పష్టం చేసి ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. అందుకు సుప్రీంకోర్టు సైతం అనుమతి ఇవ్వడంతో ఈ వ్యవహారం ఇకపైన ఎన్జీటీకి చేరనుంది.


Next Story