ప్రభుత్వాధికారులను SECగా నియమించొద్దు : సుప్రీంకోర్టు

by  |
supreme court
X

న్యూఢిల్లీ : ప్రభుత్వాధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్ఈసీ)లుగా నియమించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా చేయడమంటే రాజ్యాంగాన్ని పరిహసించడమేనని పేర్కొంది. స్వతంత్రులనే ఎస్ఈసీలుగా నియమించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది. అంతేకాదు, ఎస్ఈసీలుగా అదనపు బాధ్యతలు కలిగి ఉన్న ప్రభుత్వాధికారులందరూ వెంటనే తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. గోవా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. గోవా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్‌పై బాంబే హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ ప్రమోద్ సావంత్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

న్యాయమూర్తులు రోహింటన్ ఫాలి నారిమన్, బీఆర్ గవాయ్, హృశికేశ్ రాయ్‌ల త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. న్యాయశాఖ కార్యదర్శిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించిన గోవా ప్రభుత్వంపై మండిపడింది. ఒక ప్రభుత్వ అధికారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించడమంటే రాజ్యాంగాన్ని పరిహసించడమేనని వివరించింది. అలాగే, స్వతంత్ర అభ్యర్థిని ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఆదేశించింది. ఈ సందర్భంలోనే అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలు వెలువరించింది. ఏ రాష్ట్రంలోనైనా ఎస్ఈసీని అదనపు బాధ్యతలుగా కలిగి ఉన్నవారు వెంటనే తప్పుకోవాలని స్పష్టం చేసింది. కాగా, మున్సిపల్ రిజర్వేషన్‌లపై బాంబే హైకోర్టు తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్థించింది. మార్ముగావ్, మార్గావ్, మపూసా, క్వెపెమ్, సాంగ్వెమ్‌లలో రిజర్వేషన్‌లను పదిరోజుల్లో నోటిఫై చేయాలని, అలాగే, ఎన్నికల ప్రక్రియను ఏప్రిల్ 30లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసే ప్రమోద్ సావంత్ ప్రయత్నాలను అత్యున్నత ధర్మాసనం తిప్పికొట్టిందని ప్రతిపక్ష నేత విజయ్ సర్దేశాయ్ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు కేవలం గోవా సీఎం ప్రమోద్ సావంత్‌కే కాదు, ఆయన నాయకుడు నరేంద్ర మోడీకి చెంపపెట్టు అని విమర్శించారు.

Next Story

Most Viewed