ఏపీని ఆదుకోండి.. రాజ్యసభలో విజయసాయిరెడ్డి విజ్ఞప్తి

by  |
vijaya sai reddy
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ఇటీవల సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో స్పష్టం చేశారు. రాజ్యసభలో మంగళవారం జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ తక్షణ సాయంగా రూ.1000కోట్లు మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నవంబర్‌ 16 నుంచి 18 మధ్య దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల వల్ల 44 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 16 మంది ఆచూకీ దొరకలేదు.

అంతేకాదు వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. జలాశయాలు దెబ్బతినడంతో పాటు వేలాది ఎకరాల్లో కోతలకు సిద్ధమైన పంట నీట మునిగింది. దాదాపు 1.85 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు పాడైపోయాయి. ఏపీ ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.6,054 కోట్లు ఆస్తి నష్టం వాటిల్లిందని పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు ఏపీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలను అందజేసి ఆదుకుందని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి రూ.1000కోట్లు తక్షణ సహాయం ప్రకటించాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed